Share News

AP Pensions: ఏపీలో పింఛన్ల పండుగ ప్రారంభం.. సింగవరంలో ఆసక్తికర ఘటన..

ABN , Publish Date - Aug 31 , 2024 | 08:14 AM

సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ‘ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు’ ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 31నే కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే నేటి తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో పించన్ల పంపిణీని అధికారులు చేస్తున్నారు. రాష్ట్రంలో పింఛన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చింది...

AP Pensions: ఏపీలో పింఛన్ల పండుగ ప్రారంభం.. సింగవరంలో ఆసక్తికర ఘటన..

అమరావతి: సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ‘ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు’ ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 31నే కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే నేటి తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో పించన్ల పంపిణీని అధికారులు చేస్తున్నారు. రాష్ట్రంలో పింఛన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చింది. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం నెల వచ్చి రోజులు గడుస్తున్నా పంపిణీ చేసే పరిస్థితి ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కాగా ఒకటో తారీఖు లేదంటే ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తుండటంతో పింఛన్‌దారులు ఆనందంగా ఉన్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడం, ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సెలవుకు భంగం కలగకుండా, పెన్షన్‌దారులకు నగదు అందడం కోసం ఒకరోజు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కర్నూలు జిల్లా మండల కేంద్రం ఓర్వకల్లులో పర్యటించనున్నారు. ఓర్వకల్లులో ఆయన లబ్ధిదారులకు నేరుగా పింఛన్లను అందజేయనున్నారు. గ్రామం నడిబొడ్డున ఉన్న రచ్చకట్ట వేదికగా గ్రామ సభ నిర్వహిస్తారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల కు సీఎం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో పించన్ల పంపిణీ గ్రామ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడే లబ్ధిదారులకు ఆయన పింఛన్లను పంపిణీ చేస్తారు. అనంతరం గ్రామ సభలో ప్రసంగిస్తారు. విశాఖపట్నం జిల్లాలో ఉదయం 6.00 గంటలకే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తాటిచెట్లపాలెం వద్ద స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు పింఛన్ల సొమ్మును జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అందజేశారు.


సింగవరంలో ఆసక్తికర ఘటన..

అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే లబ్దిదారులకు అధికారులు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వం లో పెన్షన్ కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి ఒక రోజు ముందుగానే తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నామని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. ఈ రోజు సాయంత్రానికి పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సింగవరం సర్పంచ్, టీడీపీ నాయకుడు సంగన చిన పోశయ్య శుక్రవారం పింఛన్ల పంపిణీపై గ్రామమంతా తిరిగి ప్రచారం చేశారు. సైకిల్‌ తొక్కుతూ ఓ చేత్తో మైక్‌ పట్టుకొని ‘శనివారం పింఛను తీసుకునే వాళ్లంతా ఇళ్ల వద్దే ఉండాలి’ అంటూ చెప్పుకొంటూ గ్రామమంతా చుట్టేశారు. వాస్తవానికి దండోరా వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని.. ఆటో పెట్టి ప్రచారం చేసేంత స్తోమత లేదని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఖజానాను ఖాళీ చేసిందన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 09:14 AM