కారు దొంగ అరెస్టు
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:34 PM
నగరంలో కారు దొంగతనం చేసిన వ్యక్తి సింగుపురం వద్ద శ్రీకాకుళం రూరల్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డాడు.
శ్రీకాకుళం క్రైం: నగరంలో కారు దొంగతనం చేసిన వ్యక్తి సింగుపురం వద్ద శ్రీకాకుళం రూరల్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే... కొత్తరోడ్డు సమీపంలో ఉన్న చక్రధర్ ఐటీఐ యజమాని యాళ్ల చక్రధర్ ఈ నెల 20వ తేదీ రాత్రి కళాశాల వద్ద కారును పార్కు చేసి, కారుకే తాళాలు వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన కాట్రగ సంతోష్ ఈ కారును దొంగిలించాడు. దీనిపై చక్రధర్ 21వ తేదీన రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ ఎస్ఐ వాసుదేవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సింగుపురం గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఎస్ఐ వాహన తనిఖీలు చేస్తుండగా.. ఏపీ 39 బీటీ 0634 నెంబరు గల వాహనం ఎదురైంది. ఈ కారును ఆపేందుకు ఎస్ఐ తొలుత ప్రయత్నించగా, పోలీసులను తప్పించుకుని పారిపోయేందుకు కారులో ఉన్న సంతోష్ ప్రయత్నించాడు. సరిగ్గా సింగుపురం బ్రిడ్జి మీద పోలీసులు కారును అడ్డగించి, కారును దొంగిలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను చోరీకి పాల్పడినట్టు సంతోష్ అంగీకరించాడు. దీంతో ఎస్ఐ కారును స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టుకు అప్పగించారు.