వేర్వేరు ఘటనల్లో రైళ్లు ఢీకొని ఇద్దరి మృతి
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:55 PM
స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం వేర్వేరు ఘటనల్లో రైళ్లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు పలాస రైల్వే ఎస్ఐ ఎస్కే షరీఫ్ తెలిపారు.
- ఒకరు ప్రభుత్వ ఉద్యోగి.. మరొకరు గుర్తుతెలియని వ్యక్తి
ఆమదాలవలస: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం వేర్వేరు ఘటనల్లో రైళ్లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు పలాస రైల్వే ఎస్ఐ ఎస్కే షరీఫ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన నానుపాత్రుని మురళీ రావు (54) ఊసవానిపేట రైల్వేగేట్ సమీపంలో గుర్తుతెలియ ని రైలుఢీకొని మృతి చెందాడు. మురళీరావు వాకింగ్ చేస్తూ రైల్వేట్రాక్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా మురళీరావు పార్వతీపురం మన్యం జిల్లా బొండపల్లి మండల పంచాయతీ విస్తరణాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మురళీరావుకు భార్య కుమారి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే ఇదే రైల్వేస్టేషన్లోని ఫ్లాట్ఫారం దగ్గరలో గుర్తుతెలియని రైలు ఢీకొని మరో వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి వివరాలు తెలియకరాకపోగా సుమారు 50 ఏళ్లు వయస్సు ఉందని, ఆకుపచ్చ కలర్ షర్ట్, బూడిద కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. శవపంచనామా చేసి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించి మృతదేహాన్ని భద్రపరిచినట్టు తెలిపారు. ఈయన వివరాలు తెలిసినవారు స్టేషన్లో స్రందించాలని కోరారు. ఈ ప్రమాదాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే ఎస్ఐ షరీఫ్ తెలిపారు.