ఓట్ల లెక్కింపు నిర్వహణలో అలసత్వం వద్దు
ABN , Publish Date - May 21 , 2024 | 11:48 PM
జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అలసత్వానికి చోటు లేదని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని జేసీ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
- జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్
కలెక్టరేట్, మే 21: జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అలసత్వానికి చోటు లేదని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని జేసీ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ‘ఒక్కో హాల్లో అబ్జర్వర్కి ఒక సహాయకుడు ఉండాలి. లేబర్ అరేంజ్మెంట్కు సంబంధించి డ్వామా పీడీ తగు ఏర్పాట్లు చేయాలి. ఈ నెల 25న శిక్షణా తరగతులకు సంబంధించి మొదటి విడత ర్యాండమైజేషన్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై పూర్తి శిక్షణ ఇవ్వాలి. గురువారం ఆర్వోలకు, ఏఆర్వోలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామ’ని తెలిపారు. మీడియా సెంటర్, సీసీ టీవీ, వీడియోగ్రాఫర్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీసు అధికారులతో మాట్లాడారు. లెక్కింపు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఎం.గణపతిరావు, జడ్పీ సీఈఓ వేంకటేశ్వరరావు, సుడా వీసీ ఓబులేసు, ఎస్ఎస్ఏ పీవో జయప్రకాష్, డీపీవో వేంకటేశ్వర్లు, కిరణ్కుమార్, డీటీసీ చంద్రశేఖర్రెడ్డి, డ్వామా పీడీ చిట్టిరాజు, డిప్యూటీ సీఈవో వెంకటరామన్, ఎంప్లాయిమెంట్ అదికారి సుధ, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ పాల్గొన్నారు.