జిల్లా రూపురేఖలు మారుస్తాం
ABN , Publish Date - Sep 20 , 2024 | 11:42 PM
‘వైసీపీ పాలనలో అథోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. జిల్లా రూపురేఖలు మారుస్తా మ’ని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- రాజపురంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభం
కవిటి/ కంచిలి, సెప్టెంబరు 20: ‘వైసీపీ పాలనలో అథోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. జిల్లా రూపురేఖలు మారుస్తా మ’ని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన సంద ర్భంగా శుక్రవారం కవిటి మండలం రాజపురంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వెంటి లేటర్పై ఉన్న రాష్ట్ర ప్రభు త్వానికి చంద్రబాబు జవస త్వాలు నింపారు. వంద రోజుల్లో ప్రజలు ఆశించినదానికన్నా ఎక్కువే చేశాం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వైసీపీ పాలన నుంచి విముక్తి కల్పించి... స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అందజేశాం. పింఛన్ పెంపు, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు, 16వేల పోస్టులతో మెగా డీఎస్సీ తదితర వాటితో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉద్దానంలో కొబ్బరి పార్కు ఏర్పాటుకు కృషి చేస్తాం. వంశధార, నాగావళి, బాహుదా నదుల అనుసంధానానికి చర్యలు చేపడతాం. దివంగత నేత ఎర్రన్న నిర్మించిన ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును గత పాలకులు నిర్వీర్యం చేశారు. ఇంటింటికీ తాగునీరు అందించేలా కృషి చేస్తాం. జిల్లాలో ఎయిర్పోర్టుతోపాటు మత్స్యకారుల ప్రయోజనం కోసం పోర్టుల నిర్మాణం సాగిస్తాం. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి టెక్కలి, సోంపేట, పలాసలో భూములు గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇండస్ర్టీయల్ పార్కును ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి కల్పిస్తామ’ని తెలిపారు.
నమ్మకాన్ని వమ్ముచేయం: మంత్రి అచ్చెన్న
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం రూ.14లక్షల కోట్లు అప్పులు చేసి.. రూ.4 లక్షల కోట్లు మాత్రమే లబ్ధిదారులకు పంచింది. రూ.10లక్షల కోట్లు నొక్కేసింది. జగన్ బటన్ నొక్కి రాష్ట్రాన్ని వెంటిలేటర్పై పెట్టారు. రాష్ట్ర సచివాలయంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ తనాఖా పెట్టేశారు. ఏ శాఖపై సమీక్ష చేస్తున్నా అప్పులే కనిపిస్తున్నాయి. అయినా భయపడే ప్రసక్తే లేదు. సమస్యల పరిష్కారంతోపాటు సంక్షేమ పథకాల అమలుతో ప్రజల మనసును కూటమి ప్రభుత్వం గెలుచుకుంది. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పాలన సాగిస్తాం. కూటమి పాలన జిల్లాకు స్వర్ణయుగం కానుంది. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. జగన్ పర్యటనలతో.. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవారు. సమస్యలపై మాత్రం ఏనాడూ మాట్లాడలేదు. ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రేయిపగలూ అండగా నిలిచిన సీఎం చంద్రబాబుకు.. నాటి సీఎం జగన్కు ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవాలి. రాష్ట్రానికి పునర్ వైభవం తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదే. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందజేస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12వేల కోట్లు, అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు, రాష్ట్రంలో మూడు ఇండ్రస్టీయల్ పార్కులు, కొబ్బరి అనుబంధ సంస్థల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయనుంది. వరి, జీడి, మామిడి పంటలకు మద్దతు ధర కల్పిస్తూ రాష్ట్రాన్ని తోడ్పాటునిస్తోంది’ అని తెలిపారు.
- ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ ఉద్దానంలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న కొబ్బరి రైతులను ఆదుకోవాలని కోరారు. ‘ఉద్దానంలో గత తుఫాన్ల వలన ఏర్పడిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం ఈ ప్రాంతంలో కొబ్బరి పార్కు ఏర్పాటు చేయాలి. మైనర్ ఇరిగేషన్ పనులు చేపట్టాలి. కిడ్నీ సమస్యపై పరిశోధనలు వేగవంతం చేసి, రోగులను ఆదుకోవాలి. బెంతొఒరియాలకు కుల, నేటివిటీ ధ్రువపత్రాలు అందజేయాలి. కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జల్జీవన్ మిషన్ పనులు పూర్తిచేసి.. ఇంటింటికీ తాగునీరందించాలి’ అని కోరారు.
- పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ వలంటీర్లు లేకపోతే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరవని వైసీపీ నాయకులు ఊదరగొట్టారన్నారు. కానీ అనుభవజ్జుడైన సీఎం చంద్రబాబు ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీని చేశారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, పలాస ఆర్డీవో భరత్నాయక్, జనసేన ఇన్చార్జి దాసరి రాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.