అసంపూర్తిగా చోడవరం మోడల్ రైతు బజారు
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:31 AM
నియోజకవర్గ కేంద్రంలో రూ.3 కోట్లతో చేపట్టిన మోడల్ రైతు బజారు నిర్మాణం ఆగిపోయింది.
గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం
రహదారిపైనే రైతులు, చిరువ్యాపారుల పాట్లు
చోడవరం, సెప్టెంబరు 20: నియోజకవర్గ కేంద్రంలో రూ.3 కోట్లతో చేపట్టిన మోడల్ రైతు బజారు నిర్మాణం ఆగిపోయింది. 2017లో నిర్మాణం చేపట్టిన రైతు బజారును గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆరేళ్లుగా రైతులు, చిరువ్యాపారులకు నిలువ నీడ లేకుండా పోయింది. రైతులు రోడ్ల పక్కన కూరగాయలను అమ్ముకోవలసిన దుస్థితి నెలకొంది.
చోడవరం పట్టణ నడిబొడ్డున ప్రేమసమాజం రోడ్డులో గతంలో రైతు బజారు ఉండేది. ఈ రైతు బజారులో రేకుల షెడ్లు ఉండేవి. ఇక్కడ వర్షపు నీరు పోయే దారి లేకపోవడంతో వర్షాకాలంలో చినుకు పడితే రైతులకు, కొనుగోలుదారులకు ఇబ్బందికర పరిస్థితి ఉండేది. దీంతో పాత రైతు బజారు స్థానంలో రూ.3 కోట్లతో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు మోడల్ రైతు బజారు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక పక్క కూరగాయలు, మరో పక్క పూలు, పండ్లు, ఇంకో వైపు చేపలు, మాంసాహార దుకాణాలు విడివిడిగా ఏర్పాటు చేసేందుకు 64 దుకాణాల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాలు కూడా దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఈలోగా ఎన్నికలు జరిగి 2019లో అధికారం మారి వైసీపీ ప్రభుత్వం రావడంతో మోడల్ రైతు బజారు నిర్మాణం నిలిచిపోయింది. అనంతరం ఈ రైతు బజారును స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోకి తరలించేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేసినా అక్కడకు వెళ్లడానికి రైతులు, చిరువ్యాపారులతోపాటు కొనుగోలుదారులు కూడా ఆసక్తి చూపించకపోవడంతో రైతులు, చిరువ్యాపారులకు రోడ్డు కష్టాలు తప్పలేదు.
నీడ కరువైన రైతులు, వ్యాపారులు
రైతు బజారు నిర్మాణం నిలిచిపోవడంతో రైతులు, చిరు వ్యాపారులకు నిలువ నీడ లేకుండా పోయింది. వీరు ప్రధాన రహదారిపై దుకాణాలు వేసుకుని ఉత్పత్తులు విక్రయించుకునేవారు. అయితే ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడంతో దుకాణాలన్నీ ఆంధ్రాబ్యాంకు రోడ్డు, ప్రేమసమాజం రోడ్డులోకి మళ్లించారు. అప్పటి నుంచి రోజూ ఈ రోడ్డుపైనే రైతులు, వ్యాపారులు కూరగాయలు విక్రయించుకుంటున్నారు. ఎండైనా.. వాన అయినా రైతులు నడిరోడ్డుపైనే కష్టాలు పడుతున్నారు. రైతు బజారు పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని ఇటు రైతులు, అటు చిరువ్యాపారులు ఎదురుచూస్తున్నా, ఇప్పటికీ వారి కష్టాలు తీరేదారి మాత్రం కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం, ఎమ్మెల్యే రాజు మళ్లీ ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడంతో తమ కష్టాలు ఇకనైనా తీరుతాయన్న ఆశాభావంతో ఉన్నారు.
రైతు బజారు పూర్తి చేయడమే లక్ష్యం
కేఎస్ఎన్ఎస్ రాజు, ఎమ్మెల్యే , చోడవరం
చోడవరంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రైతు బజారును పూర్తిచేయడం నా లక్ష్యం. రైతు బజారు నిర్మాణాల పూర్తికి అవసరమైన నిధులు తీసుకు వస్తాను. దీనిని పూర్తి చేసి రైతులు, చిరువ్యాపారుల ఇక్కట్లు తీరుస్తాం.