కౌంటింగ్ ఫలితాలను సకాలంలో అందించాలి
ABN , Publish Date - May 29 , 2024 | 11:27 PM
జిల్లాలోని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఫలితాలను పక్కాగా సకాలంలో అందించాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డి ప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీశ్వ్యాస్ ఆదేశించారు.
అధికారులకు భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీశ్వ్యాస్ ఆదేశం
కౌంటింగ్పై జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
పాడేరు, మే 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఫలితాలను పక్కాగా సకాలంలో అందించాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డి ప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీశ్వ్యాస్ ఆదేశించారు. న్యూఢిల్లీ నుంచి రాష్ట్రంలోని జిల్లా ఎన్నికల అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ సూచనలు పక్కాగా పాటించాలని ఆయన సూచించారు. జిల్లాలో కౌంటింగ్కు చేస్తున్న ఏర్పాట్లు, శాంతిభద్రతలు, బందోబస్తు, తదితర అంశాలపై జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయసునీత జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చేపట్టిన కౌంటింగ్ ఏర్పాట్లను వివరించారు. పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు, రంపచోడవరంలో అ అసెంబ్లీ స్థానానికి సంబంధించి కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల నిఘాతోపాటు వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. కౌంటింగ్కు సూపర్వైజర్లు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులను నియమించాలమన్నారు. ఏఎస్పీ ప్రతాప్శివకిశోర్ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని, అలాగే జిల్లా వ్యాప్తంగా 22 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అవసరమైన బందోబస్తు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.