కిక్కిరిసిన రైళ్లు
ABN , Publish Date - Oct 08 , 2024 | 01:39 AM
దసరా సమీపిస్తుండడంతో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిస్తున్నాయి.
ఊపందుకున్న దసరా ప్రయాణాలు
జనరల్ కోచ్లను తలపిస్తున్న రిజర్వేషన్ బోగీలు
గోదావరి, గరీబ్రధ్, కోణార్క్, దురంతో, ఎల్టీటీ సహా పలు ప్రధాన రైళ్లకు 22 వరకూ ఫుల్ డిమాండ్
విశాఖపట్నం, అక్టోబరు 7:
దసరా సమీపిస్తుండడంతో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిస్తున్నాయి. విశాఖ నుంచి బయలుదేరే ఒరిజినేటింగ్ రైళ్లతోపాటు దూర ప్రాంతాల నుంచి నగరం మీదుగా నడిచేవి కూడా కిటకిటలాడుతున్నాయి. సోమవారం ఉదయం జన్మభూమి ఎక్స్ప్రెస్ మొదలు రాత్రి ముంబై వెళ్లే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ వరకూ రద్దీ కొనసాగింది. ప్రధానంగా మధ్యాహ్నం బయలుదేరే రత్నాచల్ ఎక్స్ప్రెస్కు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. రిజర్వేషన్, జనరల్ కోచ్లలో సిటీ బస్సుల్లో మాదిరిగా నిలబడి ప్రయాణించాల్సి వచ్చింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం మీదకు చేరుకోగానే సీటు కోసం ప్రయాణికులు ఎగబడడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో పిల్లపాపలతో బయలుదేరినవారు కొందరు జనరల్ కోచ్లలోకి ప్రవేశించలేక, జరిమానాలు చెల్లించడానికి సిద్ధపడి రిజర్వేషన్ కోచ్లలో ఎక్కారు. తిరుమల ఎక్స్ప్రెస్ స్లీపర్ క్లాస్ కోచ్లు కూడా జనరల్ కోచ్లను తలపించాయి. ఇక విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లకు కూడా సోమవారం తాకిడి ఎక్కువగానే ఉంది. సికింద్రాబాద్ నుంచి వయా విశాఖ మీదుగా భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్కు రద్దీ నెలకొంది.
సికింద్రాబాద్ రైళ్లకు డిమాండ్
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, అటు నుంచి ఇటు వచ్చి దసరా తర్వాత తిరుగు ప్రయాణమయ్యే వారితో సికింద్రాబాద్ రైళ్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. గోదావరి (12727), గరీబ్రధ్ (12739), కోణార్క్ (11020), ఫలక్నూమా (12703), విశాఖ ఎక్స్ప్రెస్ (17015), విశాఖ-మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ (12861), దురంతో (22203), సంబల్పూర్-నాందేడు (20809), ఎల్టీటీ (18519), విశాఖ-నాందేడు ఎక్స్ప్రెస్ (20811) వంటి ప్రధాన రైళ్లకు ఈనెల 22వ తేదీ వరకు బెర్తులు రిజర్వు అయిపోయాయి. వందేభారత్ రైళ్లకు కూడా ఈనెల 15వ తేదీ వరకూ డిమాండ్ ఏర్పడడం విశేషం. అలాగే జన్మభూమి ఎక్స్ప్రెస్ (12805)కు ఈనెల 16వ తేదీ వరకూ సీట్లు లభించే పరిస్థితి లేదు. ఇక హౌరా, చెన్నై, బెంగళూరు వెళ్లే రైళ్లు గత నెల మూడో వారం నుంచి కిటకిటలాడుతున్నాయి.
విశాఖ-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక పాసింజర్ రైళ్లు
విశాఖపట్నం : దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక పాసింజర్ రైళ్లను ప్రవేశపెడుతున్నామని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. 08529 నంబరు గల రైలు ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రతిరోజు ఉదయం 10.00 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08530 నంబరు గల రైలు ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి సాయంత్రం 3.55 గంటలకు విశాఖ చేరుతుంది.