ఎన్నికల విధులను అంకితభావంతో నిర్వహించాలి
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:42 PM
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల్లో తమకు కేటాయించిన విధులను సిబ్బంది అంకితభావంతో నిర్వహించాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ సూచించారు.
ఎస్పీ కేవీ మురళీకృష్ణ
అనకాపల్లి టౌన్, జనవరి 30 : ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల్లో తమకు కేటాయించిన విధులను సిబ్బంది అంకితభావంతో నిర్వహించాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ సూచించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసులకు రెరడో విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక రింగురోడ్డులోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల శిక్షణ పొందిన అధికారులు, జిల్లా పోలీసులకు, సెక్టార్ పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధి విధానాలు, నియమ నిబంధనలు, సంబంధిత చట్టాలు తదితర అంశాలపై పోలీస్ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రణాళికాబద్ధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని వారికి సూచించారు. ఎన్నికల విధి విధానాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలను ఎస్పీ స్వయంగా వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగిసే వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముద్రించిన పోలీస్ డైరీని ఎస్పీ ఆవిష్కరించి అధికారులకు, అసోసియేషన్ సభ్యులకు అందజేశారు. ఈ సమావేశంలో నర్సీపట్నం ఏఎస్పీ అదిరాజ్సింగ్ రాణా, అదనపు ఎస్పీలు బి.విజయభాస్కర్, పి.సత్యనారాయణరావు, డీఎస్పీలు వి.సుబ్బరాజు, కేవీ సత్యనారాయణ, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.