బోసిపోతున్న గంగవరం పోర్టు
ABN , Publish Date - Apr 27 , 2024 | 01:34 AM
కార్మికులు సమ్మెబాట పట్టడంతో అదానీ గంగవరం పోర్టు బోసిపోయింది.
కొనసాగుతున్న కార్మికుల ఆందోళన
పెదగంట్యాడ, ఏప్రిల్ 26:
కార్మికులు సమ్మెబాట పట్టడంతో అదానీ గంగవరం పోర్టు బోసిపోయింది. నిత్యం వేలాది మంది కార్మికులు, లోడింగ్, అన్లోడింగ్కు వినియోగించే క్రేన్లు, డంపర్లు, లోడర్లతో ఎంతో సందడిగా ఉండే గంగవరం పోర్టు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది. గంగవరం పోర్టు లోపల, ప్రధాన గేటు ఎదుట కార్మికులు గడిచిన పద్దెనిమిది రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. బందోబస్తుగా వందలాది మంది పోలీసులు ఉంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.
అదానీ గంగవరం పోర్టులో తొమ్మిది బెర్తులు ఉన్నాయి. ఈ బెర్తుల ద్వారా నౌకలలోడింగ్, అన్లోడింగ్ జరుగుతుంది. బొగ్గు, ఐరన్ఓర్, ఎరువులు, లైమ్స్టోన్, అల్యూమినియం రోల్స్, గోధుమలు, బియ్యం...వంటివి ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. ఈ పనుల్లో వివిధ ట్రేడ్లకు చెందిన సుమారు రెండున్నర వేల మంది కార్మికులు ఉన్నారు. ఇందులో 516 మంది స్థానికులు కాగా, మిగిలిన వారంతా స్థానికేతరులు. తమకు వేతనాలు పెంచాలని, కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం ఉచితంగా అందించాలని, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికుల డిమాండ్ల విషయంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోవడంతో పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి.