ఐసెట్, ఈసెట్లో మెరిశారు
ABN , Publish Date - May 31 , 2024 | 12:49 AM
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఏపీ ఐసెట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులతో విద్యార్థులు మెరిశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈసెట్- 2024 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.
- ఏపీ ఐసెట్లో జిల్లాకు ర్యాంకుల పంట
- జిల్లా విద్యార్థులకు టాప్ ర్యాంకులు
- ఈసెట్లో 89.36 శాతం ఉత్తీర్ణత
అనకాపల్లి, మే 30 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఏపీ ఐసెట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులతో విద్యార్థులు మెరిశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈసెట్- 2024 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంతో పాటు మెటలర్జీ ఇంజనీరింగ్ విభాగాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లా నుంచి ఏపీ ఐసెట్కు 190 మంది రిజిస్టర్ చేసుకోగా, 181 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 180 మంది (99.9 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో చీడికాడ మండలం ఎల్ఎన్ పురం గ్రామానికి చెందిన మాతల హర్షిత 129 మార్కులతో మొదటి ర్యాంకు సాధించింది. రోలుగుంట మండలం ఎన్.కొత్తూరు గ్రామానికి చెందిన రత్తుల శివ 120 మార్కులతో 3వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. మాడుగులకు చెందిన మామిడి పూర్ణ 99 మార్కులతో 11వ ర్యాంకు సాధించింది. మెటలర్జీ ఇంజనీరింగ్ విభాగంలో చీడికాడ మండలం తురువోలుకు చెందిన ముర్రు రమేశ్ 116 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఇదే విభాగంలో అనకాపల్లి మండలం రొంగలివానిపాలేనికి చెందిన మేడిశెట్టి వైభవ్ 112 మార్కులతో 3వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. అనకాపల్లి మండలం విజయరామరాజుపేటకు చెందిన భీశెట్టి నాగభూషణరావు 107 మార్కులతో 7వ ర్యాంకు సాధించగా, అనకాపల్లికి చెందిన కోరాడ తేజ్కిరణ్ 104 మార్కులు సాధించి 10వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో రాంబిల్లి మండలం కొత్తూరుపేటకు చెందిన పూడి అశోక్ 164 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించాడు. బుచ్చెయ్యపేట మండలం పోలిపల్లికి చెందిన జనపరెడ్డి పవన్కుమార్ 145 మార్కులతో 5వ ర్యాంకు, సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలేనికి చెందిన గండి ధనుంజయ 140 మార్కులతో 9వ ర్యాంకు సాధించాడు.
ఏపీ ఈసెట్లో 89.36 శాతం ఉత్తీర్ణత
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు జిల్లా నుంచి 190 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 188 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 168 మంది (89.36 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.