కార్పొరేట్ స్థాయిలో ఐటీడీఏ కార్యాలయం ముస్తాబు
ABN , Publish Date - Jan 07 , 2024 | 11:06 PM
స్థానిక ఐటీడీఏ కార్యాలయాన్ని కార్పొరేట్ స్థాయిలో ముస్తాబు చేశామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన ఐటీడీఏ కార్యాలయం, పరిసరాల ఆధునికీకరణ పనులను ఆయన ఆదివారం ప్రారంభించారు.
పాడేరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ కార్యాలయాన్ని కార్పొరేట్ స్థాయిలో ముస్తాబు చేశామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన ఐటీడీఏ కార్యాలయం, పరిసరాల ఆధునికీకరణ పనులను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునికీకరణలో భాగంగా ప్రాజెక్టు అధికారి చాంబర్, సమావేశ మందిరం, వాహనాల పార్కింగ్, కార్యాలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. తాజా ఆధునికీకరణ పనులతో ఐటీడీఏ కార్యాలయం కార్పొరేట్ కార్యాలయాలను మించి ఆకర్షణీయంగా మారిందన్నారు. కార్యాలయం ఆవరణలోనే అధికారులు, సందర్శకులకు కారు పార్కింగ్, కార్యాలయం బయట బైక్ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. కార్యాలయ ప్రాంగణంలో అందమైన మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు. తక్కువ సమయంలో ఐటీడీఏ కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ డీవీఆర్ఎం.రాజు, డీఈఈ పి.అనుదీప్, ఏఈఈ బి.దేముళ్లును ఐటీడీఏ పీవో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఐటీడీఏ ఉద్యానవనాధికారి ఎన్.అశోక్, అకౌంట్స్ అధికారి శ్రీనివాస్కుమార్, పద్మాపురం గార్డెన్ మేనేజర్ లకే బొంజుబాబు, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.