ఆడుదాం ఆంధ్రపై ఆటగాళ్ల అసహనం
ABN , Publish Date - Feb 12 , 2024 | 01:12 AM
ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మూడు రోజులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో జరుగుతున్నాయి.
భోజనం తినలేకపోయిన క్రీడాకారులు
మైదానం గట్టిగా ఉండడంతో గాయాలపాలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):
ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మూడు రోజులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో జరుగుతున్నాయి. పోటీల్లో భాగంగా కబడ్డీ, ఖోఖో ఆటగాళ్లకు మ్యాచులు నిర్వహించారు. మైదానంలో నేల గట్టిగా (హార్డ్)గా ఉండడంతో పలువురు క్రీడాకారులకు గాయాలయ్యాయి. మైదానాన్ని సరిగా సిద్ధం చేయలేదని పలువురు క్రీడాకారులు అసహనం వ్యక్తం చేశారు. నేల చాలా గట్టిగా ఉండడంతో పలువురు చేతులు, కాళ్లకు గాయాలవడంతో వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఆదివారం మధ్యాహ్నం ఆటగాళ్లకు అందించిన బిర్యానీ బాగా లేకపోవడంతో పలువురు డస్ట్బిన్లో పడేశారు. చాలామంది క్రీడాకారులు పెరుగన్నంతోనే సరిపెట్టుకున్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలకు అధికారులు సరైన ఏర్పాటు చేయలేకపోయారని క్రీడాకారులు వాపోయారు. భోజనం కూడా సరిగా లేకపోతే ఎలా ఆడతామని అసహనం వ్యక్తం చేశారు.
రేపు నగరానికి రానున్న సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకకు హాజరు
విశాఖపట్నం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నగరానికి రానున్నారు. పీఎంపాలెంలోని ఏసీఏ-ఏడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగే ‘ఆడుదాం ఆంధ్ర’ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరవుతారు. మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు సీఎం విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఐటీహిల్స్-3పై ఉన్న హెలీప్యాడ్కు 5.45 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఆరు గంటలకు పీఎంపాలెం క్రికెట్ స్టేడియంకు చేరుకుంటారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ స్టేడియంలో కూర్చొన్న ప్రజలకు అభివాదం చేసిన అనంతరం క్రికెట్ ఫైనల్మ్యాచ్ చివరి ఐదు ఓవర్లను వీక్షిస్తారు. మ్యాచ్ముగిసిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ షో, లైట్ షో వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడి, విజేతలకు బహుమతులు అందజేస్తారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రాత్రి 8.05 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని, విమానంలో విజయవాడ వెళ్తారు.