పెందుర్తిలో పట్టపగలు భారీ చోరీ
ABN , Publish Date - Jan 17 , 2024 | 12:53 AM
పెందుర్తిలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటి ప్రధాన, పెరటి తలుపులను పగులగొట్టి లోపలకు ప్రవేశించిన దొంగలు బీరువాలో భద్రపరిచిన పది తులాల బంగారం, రూ.50 వేల నగదును దోచుకున్నారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
10 తులాల బంగారం, రూ.50 వేల నగదు అపహరణ
పెందుర్తి, జనవరి 16: పెందుర్తిలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటి ప్రధాన, పెరటి తలుపులను పగులగొట్టి లోపలకు ప్రవేశించిన దొంగలు బీరువాలో భద్రపరిచిన పది తులాల బంగారం, రూ.50 వేల నగదును దోచుకున్నారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెందుర్తి జంక్షన్ సమీపంలోని డిపార్ట్మెంట్ స్టోర్స్ వెనక గల వేగివారివీధిలో లెంక అరుణ అనే మహిళ టైలరింగ్ పనులు చేస్తూ ఇద్దరు కుమారైలతో నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి అరకు వెళ్లారు. కాగా సాయంత్రం ఆమెకు స్థానికులు ఫోన్ చేసి మీ ఇంటి ద్వారాలు తెరిచి ఉన్నాయని సమాచారం అందించారు. దీంతో ఆమె అరకు నుంచి హడావుడిగా ఇంటికి వచ్చారు. ఇళ్లంతా చిందరవందరగా ఉండడం, బీరువాలో భద్రపరిచిన భద్రపరిచిన పది తులాల బంగారం, రూ.50 వేలు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సీఐ మరిడాన శ్రీనివాసరావు సిబ్బందితో సంఘటనాస్థలాన్ని సందర్శించి, క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. కాగా దొంగలు సుమారు రెండు గంటల పాటు ఇంట్లోనే గడిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ సొత్తుతో ఇంటి వెనక వైపు నుంచి పారిపోయినట్టు భావిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.