ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు
ABN , Publish Date - Jan 09 , 2024 | 01:26 AM
సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
16 మందిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
త్వరలో తహసీల్దార్ల బదిలీ
విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):
సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో రెండున్నరేళ్ల కంటే తక్కువ కాలం పనిచేసిన 16 మంది అధికారులను గుర్తించి నోడల్ అధికారులుగా నియమించారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకం కోసం వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ వి.రవీంద్రను నోడల్ అధికారిగా నియమించారు. అలాగే సిబ్బందికి శిక్షణ కోసం డీఈవో ఎల్.చంద్రకళను, ఎన్నికల సామగ్రి పర్యవేక్షణకు జీవీఎంసీ యూసీడీ పీడీ పాపునాయుడును, రవాణాకు జిల్లా వ్యవసాయ అధికారి కె.అప్పలస్వామిని, కప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీ కోసం జిల్లా సమాచార అధికారి ఎంజీ చంద్రశేఖర్ను నోడల్ అధికారులుగా నియమించారు. ఇంకా, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్, శాంతిభద్రతల పర్యవేక్షణకు జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ఫిషరీస్ ఏడీ ఎం.విజయకృష్ణలను, ఈవీఎంల నిర్వహణకు జిల్లా సహకార అధికారి టి.ప్రవీణను, మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్టు పర్యవేక్షణకు జీవీఎంసీ కమిషనర్ సాయికాంతవర్మను, ఎన్నికల వ్యయ నియంత్రణ పరిశీలనకు జిల్లా ఆడిట్ అధికారి డీడీ ముల్లార్ను, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ ముద్రణకు సమగ్రశిక్ష అభియాన్ ఏపీసీ బి.శ్రీనివాసరావు, మీడియా బాధ్యతలకు జిల్లా ఉద్యానవన అధికారి కె.మన్మథరావును, కమ్యూనికేషన్ ప్లాన్కు జడ్పీ డిప్యూటీ సీఈవో డి.సత్యనారాయణను, ఓటర్ల జాబితా పర్యవేక్షణకు సివిల్ డిఫెన్స్ ఎస్డీసీ కె.పద్మలతను, ఓటర్ హెల్ప్లైన్, ఫిర్యాదులు, పరిష్కారం సెల్కు దివ్యాంగుల విభాగం ఏడీ జె.మాధవిని, ఎస్వీఈఈపీకి సాంఘిక సంక్షేమ శాఖ జేడీ కంచరాన రామారావును, పరిశీలకుల లైజనింగ్ కోసం జిల్లా సర్వే ఏడీ కె.సూర్యారావును నోడల్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఎ.మల్లికార్జున ఉత్తర్వులు జారీచేశారు. కాగా జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు తప్ప మిగిలిన తహసీల్దార్లకు నెలాఖరులోగా బదిలీ అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే తహసీల్దార్ల జాబితాను ప్రభుత్వానికి పంపించారు.