ఇప్పటికీ పరాయి పంచనే!
ABN , Publish Date - Jul 27 , 2024 | 12:57 AM
నర్సీపట్నం మునిసిపాలిటీలో వార్డు సచివాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పథకాలు, పౌర సేవలు అందించడానికి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన ప్రభుత్వం సొంత భవనాలు పూర్తి స్థాయిలో నిర్మించలేదు. దీంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మునిసిపాలిటీ పరిధిలో 17 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. నాలుగేళ్లు గడిచినా వీటికి భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో మహిళా మండలి భవనాలు, క్రీడా భవనం, అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నారు.
28 వార్డులకు 17 వార్డు సచివాలయాలు ఏర్పాటు
సొంత భవనాలు లేక సిబ్బంది, ప్రజలకు ఇక్కట్లు
అద్దె ఇళ్లలో ఐదు వార్డు సచివాలయాలు
గ్రంథాలయంలోని గదిలో 12వ వార్డు సచివాలయం
జిమ్ కోసం కేటాయించిన గదిలో 22, 23 వార్డు సచివాలయాలు
నర్సీపట్నంలో వార్డు సచివాలయాల దుస్థితి
నర్సీపట్నం, మే 31:
నర్సీపట్నం మునిసిపాలిటీలో వార్డు సచివాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పథకాలు, పౌర సేవలు అందించడానికి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన ప్రభుత్వం సొంత భవనాలు పూర్తి స్థాయిలో నిర్మించలేదు. దీంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మునిసిపాలిటీ పరిధిలో 17 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. నాలుగేళ్లు గడిచినా వీటికి భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో మహిళా మండలి భవనాలు, క్రీడా భవనం, అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నారు.
మునిసిపాలిటీలో బీసీ కాలనీలోని 1, 2, 3 వార్డు సచివాలయాలు నవనిర్మాణ సమితి వికాస్ భవనంలో నిర్వహిస్తుండగా, పాత సంతబయలు వాటర్ట్యాంక్ వద్ద ఒక గదిలో 4, 5 వార్డుల సచివాయం నిర్వహిస్తున్నారు. రామారావుపేట 6, 7 వార్డులు, కొత్తవీధి 8, 9 వార్డుల సచివాలయాలు ఇద్దె ఇళ్లలో నడుపుతున్నారు. పెదబొడ్డేపల్లిలోని పాత పంచాయతీ భవనంలో 10, 11 వార్డులు, 13, 14 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. పెదబొడ్డేపల్లి శ్రీరామ్నగర్ కాలనీలో గ్రంథాలయం గదిలో 12వ వార్డు సచివాలయం, మెప్మా కార్యాలయంలో 15వ వార్డు సచివాలయం, శారదానగర్ అద్దె ఇంట్లో 16వ వార్డు సచివాలయం నిర్వహిస్తున్నారు. బలిఘట్టం పాత పంచాయతీ భవనంలో 17, 18 వార్డు సచివాలయం నిర్వహిస్తున్నారు. ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా 19, 20వ వార్డు సచివాయం పాత బయపురెడ్డిపాలెంలోని అద్దె ఇంట్లో ఏర్పాటు చేశారు. 21వ వార్డు సచివాలయం శారదానగర్లోని అద్దె ఇంట్లో నడుస్తోంది. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో క్రీడాకారుల కోసం నిర్మించిన భవనంలో 22, 23 వార్డు సచివాలయాలు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నం పాత మునిసిపల్ కార్యాలయంలో 24, 25, 26, 27 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఏరియా ఆస్పత్రి ఎదురుగా మహిళా మండలి భవనంలో 28వ వార్డు అయ్యన్నకాలనీ సచివాలయం ఏర్పాటు చేశారు. ప్రైవేటు భవనాలలో సచివాలయాలు నిర్వహించడంతో ప్రభుత్వ ధనం వృథా అవుతోంది. అంతేకాదు ప్రజావసరాలకు సరిపడా భవనాలు లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇక్కట్ల మధ్య విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఉన్న పది మంది ఉద్యోగులు ఒకే గదిలో పనిచేయాల్సి వస్తోంది. ప్రతి వార్డులో మునిసిపాలిటీకి చెందిన ఖాళీ స్థలాలు ఉన్నప్పటికి ప్రభుత్వం భవనాలను నిర్మించడం లేదు. దీంతో అటు ఉద్యోగులు, ఇటు ప్రజలు అవస్థలు పడుతున్నారు.