ఉదయం ఎండ.. మధ్యాహ్నం వాన
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:55 AM
మన్యంలో శుక్రవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ ఠారెత్తించింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. వాతావరణం పూర్తిగా చల్లబడడంతో జనం ఉపశమనం పొందారు. భారీ వర్షానికి జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాడేరుతో పాటు ఏజెన్సీలోని పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
- మన్యంలో భిన్న వాతావరణం
- కొయ్యూరులో ఉదయం 43.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
- మధ్యాహ్నం నుంచి పాడేరు, అరకులోయ, జి.మాడుగులలో భారీ వర్షం
పాడేరు, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): మన్యంలో శుక్రవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ ఠారెత్తించింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. వాతావరణం పూర్తిగా చల్లబడడంతో జనం ఉపశమనం పొందారు. భారీ వర్షానికి జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాడేరుతో పాటు ఏజెన్సీలోని పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..
కొయ్యూరులో శుక్రవారం 43.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జి.మాడుగులలో 38.7, పాడేరులో 37.3, చింతపల్లిలో 37.2, ముంచంగిపుట్టులో 36.8, పెదబయలులో 36.6, హుకుంపేటలో 36.1 డిగ్రీల సెల్సియస్గా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అరకులోయలో....
అరకులోయ: పట్టణంలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ తరువాత ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి గంటన్నర సేపు ఏకధాటిగా వర్షం కురిసింది. వడగళ్లతో కూడిన వాన కురవడంతో జనజీవనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలో శుక్రవారం ఉదయం ఎండ ఎక్కువగా ఉండగా, మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు కె.కోడాపల్లి, భీరం, సింగర్భం పంచాయతీల పరిధిలో పలు చోట్ల భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు చాపరాయి జల విహారి ప్రాంతం నిర్మానుష్యంగా కనిపించింది. మధ్యాహ్నం మూడు గంటల తరువాత వర్షం కురిసింది.