గోదావరి డెల్టా రబీ పంటలకు నీరు విడుదల
ABN , Publish Date - Apr 02 , 2024 | 12:14 AM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి 3,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ బి.శ్రీధర్ తెలిపారు.
డొంకరాయి జలాశయం నుంచి 3,500 క్యూసెక్కులు
విద్యుదుత్పత్తి అనంతరం మరో 3,500 క్యూసెక్కులు
ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ శ్రీధర్
సీలేరు, ఏప్రిల్ 1: సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి 3,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ బి.శ్రీధర్ తెలిపారు. సోమవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ గోదావరి డెల్టా రబీ పంటలకు మార్చి 10 నుంచి సీలేరు కాంప్లెక్సులోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. అయితే రబీ పంటలకు విద్యుదుత్పత్తి అనంతరం విడుదల అవుతున్న నీరు సరిపోకపోవడంతో ఇరిగేషన్ అధికారులు డొంకరాయి నుంచి అదనంగా మరో 3,500 క్యూసెక్కుల నీటిని ఐదు రోజుల పాటు విడుదల చేయాలని జెన్కో ఉన్నతాధికారులను కోరారన్నారు. దీంతో తమ ఉన్నతాధికారులు డొంకరాయి జలాశయం నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని రబీకి విడుదల చేయాలని ఆదేశించడంతో శనివారం సాయంత్రం డొంకరాయి జలాశయం నుంచి 6, 7 నంబర్ల గేట్ల ద్వారా నీరు విడుదల చేశామన్నారు. సీలేరు కాంప్లెక్సు నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 3,500 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి లేకుండా జలాశయం నుంచి మరో 3,500 క్యూసెక్కులతో కలిపి మొత్తం 7 వేల క్యూసెక్కుల నీరు రబీ పంటలకు సీలేరు నుంచి విడుదల అవుతుందని ఆయన తెలిపారు. సీలేరు కాంప్లెక్సులో ప్రస్తుతం డొంకరాయి, సీలేరు (గుంటవాడ) జలాశయాల్లో 11 టీఎంసీలు, బలిమెలలో ఆంధ్రా వాటాగా 17 టీఎంసీలు కలిపి మొత్తం 28 టీఎంసీల నీటి నిల్వలు సీలేరు కాంప్లెక్సులో ఉన్నాయని, ఈ నీటినే జూన్ నెలాఖరు వరకు పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం గోదావరి డెల్టాకు అదనపు నీటి విడుదల నేపథ్యంలో బలిమెల నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్ ఇంజనీర్లు కేకేవీ ప్రశాంత్కుమార్, వెంకటేశ్వరరావు, ఈఈ బాలకృష్ణ, ఏడీఈ అప్పలనాయుడు పాల్గొన్నారు.