సిటీస్కాన్ సేవలు అందుబాటులోకి వచ్చేదెన్నడో?
ABN , Publish Date - Jan 17 , 2024 | 11:39 PM
అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రిలో సిటీస్కాన్ సేవలు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది డిసెంబరు 20న కొత్త సిటీస్కాన్ యంత్రాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించడంతో తమ కష్టాలు తీరతాయని రోగులు భావించారు. అయితే దానికి తగిన సిబ్బంది లేక మూతపడడంతో నిరాశ చెందుతున్నారు.
గత నెలలో కొత్త యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి అమర్నాథ్
సిబ్బంది కొరతతో సేవలు దూరం
అనకాపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రిలో సిటీస్కాన్ సేవలు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది డిసెంబరు 20న కొత్త సిటీస్కాన్ యంత్రాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించడంతో తమ కష్టాలు తీరతాయని రోగులు భావించారు. అయితే దానికి తగిన సిబ్బంది లేక మూతపడడంతో నిరాశ చెందుతున్నారు.
ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రిలో సిటీస్కాన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవలసి వస్తోంది. ఈ క్రమంలో అదాని ఫౌండేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ ఆస్పత్రికి సిటీస్కాన్ యంత్రాన్ని అందజేసింది. దీనిని మంత్రి గుడివాడ అమర్నాథ్ గత డిసెంబరు 20న ప్రారంభిం చారు. సిటీ స్కాన్ సేవలు వారం రోజుల్లో అందుబాటులోకి వస్తాయని ఆయన ప్రకటించారు. అయితే ఇది వినియోగంలోకి రావాలంటే ఇద్దరు టెక్నీషియన్లు, నలుగురు సహాయకులు, ఒక మేనేజరు.. మొత్తం ఏడుగురు సిబ్బంది అవసరమని ఆస్పత్రి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అక్కడ నుంచి అనుమతులు రాకపోవడంతో సిటీస్కాన్ గదిని ఎప్పటిలాగానే తాళం వేసి ఉంచారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు వివరణ కోరగా సిటీస్కాన్ కోసం సిబ్బందిని నియమించాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సిబ్బందిని నియమించి సిటీస్కాన్ సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.