Share News

సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:59 PM

పార్వతీపురం పట్టణాన్ని స్వచ్ఛ సుందర పార్వతీపురంగా తీర్చిదిద్దడంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ప్రభుత్వ పాఠశాలల ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పట్టణాన్ని స్వచ్ఛ సుందర పార్వతీపురంగా తీర్చిదిద్దడంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ప్రభుత్వ పాఠశాలల ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో స్వచ్ఛ సుందర పార్వతీపురం, అంగన్‌వాడీల సుందరీకరణపై ఆయా శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. తడిచెత్తను, పొడిచెత్తను వేరుచేసి చెత్త నుంచి సంపద సృష్టించడం, పిల్లల కోసం సుందరమైన పార్క్‌లు, ముఖ్యకూడళ్లలో స్ర్కాప్‌ ఆర్ట్స్‌, బర్రెల గ్రౌండ్‌ వంటివి ఏర్పాటు చేసేందుకు సంకల్పించినట్టు చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, జనసంచారం ఉన్న ప్రదేశాలను గుర్తించి స్వచ్ఛ సుందర పార్వతీపురం లోగోలను, సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ గోడలపై సవర ఆర్ట్స్‌తో కూడిన చిత్రాలను, ప్రజలను చైతన్యపరిచే చిత్రాలను వేయించాలన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాలి

జిల్లాలో 516 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, వాటికి మంచి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పెయింటింగ్స్‌ వేయించి ఉన్నవాటిని మినహాయించి మిగిలిన కేంద్రాలకు లోపల, వెలుపల నిర్దేశించిన రంగులను వేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి ఎంఎన్‌ రాణి, డీఈవో జి.పగడాలమ్మ, ఇతర జిల్లా అధికారులు, ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ ఉపాధ్యాయులు, సీడీపీవోలు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:59 PM