నేటి నుంచే నామినేషన్ల ఘట్టం
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:15 AM
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు అసలైన ఘట్టం గురువారం ప్రారంభమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆ రోజు మొదలుకానుంది.
జిల్లాలో ఏర్పాట్లు పూర్తి
పార్వతీపురం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి)/సాలూరు రూరల్/సీతంపేట: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు అసలైన ఘట్టం గురువారం ప్రారంభమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆ రోజు మొదలుకానుంది. ఇది 25వ తేదీతో ముగుస్తుంది. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 29. పోలింగ్ మే 13, ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతాయి. నోటిఫికేషన్ జారీతో ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. కాగా జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, అరకు పార్లమెంట్ స్థానానికి గాను అభ్యర్థులు నామినేషన్లు పత్రాలు అభ్యర్థులు సమర్పించాల్సి ఉంది. అరకు పార్లమెంట్ స్థానానికి సంబంధించి నామినేషన్ల సేకరణ కలెక్టరేట్లో జరగనుంది. పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో, పాలకొండకు గాను సీతంపేటలోని ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ కార్యాలయం గ్రౌండ్ప్లోర్లోనే అంబేడ్కర్బ్లాక్లో నామినేషన్లు స్వీకరిస్తారు. కురుపాం, సాలూరుకు సంబంధించి ఆయా తహసీ ల్దార్ కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అరకు పార్లమెంట్ స్థానానికి గాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నిశాంత్కుమార్ ఆధ్వర్యంలో నామినేషన్లు స్వీకరిస్తారు. సాలూరు నియోజకవర్గానికి పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్, పాలకొండకు సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనాకుమారి పార్వతీపురానికి ఆర్డీవో హేమలత, కురుపానికి పాలకొండ ఆర్డీవో వీవీ రమణ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 29న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. ఎన్నికల నోటిఫకేషన్కు సంబంధించి పూర్తి వివరాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించనున్నారు.