మెగా డీఎస్సీ ఇవ్వాల్సిందే
ABN , Publish Date - Feb 07 , 2024 | 11:55 PM
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, 25 వేల పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం నిరసనకు దిగారు. తొలుత కోట నుంచి ర్యాలీ చేపట్టారు.
మెగా డీఎస్సీ ఇవ్వాల్సిందే
25 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్
డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ర్యాలీ.. ధర్నా
కలెక్టరేట్, ఫిబ్రవరి 7: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, 25 వేల పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం నిరసనకు దిగారు. తొలుత కోట నుంచి ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్కు చేరుకున్నాక బైఠాయించారు. నాలుగేళ్లుగా డీఎస్సీ విడుదల చేయకపోవడం సిగ్గు సిగ్గు.. మెగా డీఎస్సీ ఎక్కడ.. మెగా డీఎస్సీ ఇవ్వకపోతే నిన్ను దింపడానికి మేము సిద్ధం.. జీవో 117ను రద్దు చేయాలి.. అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు సీహెచ్ హరీష్, రామన్న, పీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా అదిగో డీఎస్సీ , ఇదిగో డీఎస్సీ అంటోందని, 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇవేకాక ఈనెల చివరి నాటికి మరో 5 వేల మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతున్నారని తెలిపారు. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షలు మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారని, తక్షణమే డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.