అధికారుల తీరుపై పాలకవర్గ సభ్యుల ధ్వజం
ABN , Publish Date - Jun 30 , 2024 | 12:06 AM
మున్సిపల్ అధికారుల తీరుపై పాలకవర్గ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
![అధికారుల తీరుపై పాలకవర్గ సభ్యుల ధ్వజం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సాలూరు: మున్సిపల్ అధికారుల తీరుపై పాలకవర్గ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా అధికారులు ఎజెండాను చదివి వినిపించారు. మున్సిపాల్టీలోని సాముహిక మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకు రావాలని అనేక సార్లు సమావేశంలో చర్చించినప్పటికీ ఆ విధంగా అధికారు లు పని చేయకపోవటంతో నేడు ఆ సమస్య మంత్రి దృష్టికి వెళ్లిందని కౌన్సిలర్లు రాపాక మాధవరావు, గిరి రఘుతో పాటు పలువురు అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్న 20వ నెంబర్ షాపు అద్దె సుమారు రూ.11లక్షలు రావాల్సి ఉండగా అధికారులు ఎందుకు వసూలు చేయటం లేదని, దీనిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని కౌన్సిల్ సభ్యులతో పాటు వైస్ చైర్మన్ జార్జాపు దీప్తి హెచ్చరించారు. అస్సలు కమిషనర్ ఎవరో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు అలాంటప్పుడు సాధారణ నిధుల నుంచి కారుకు అద్దె చెల్లించటం సరికాదని కౌన్సిల్ సభ్యు లు అభిప్రాయపడ్డారు. కౌన్సిలర్గా ప్రజలను నుంచి గెలిచాం కానీ అస్సలు తల ఎత్తుకుని తిరగలేకపోతున్నామని, ఏ సమస్య ఉన్నా అధికా రుల దృష్టికి తీసుకుని వచ్చినా సమస్య పరిష్కారం కావటం లేదని 26వ వార్డు కౌన్సిలర్ సన్యాసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఒక్కో కుక్కకు సాధారణ నిధుల నుంచి రూ.1600 ఖర్చు చేయటం సరికాదని కౌన్సిలర్లు చెప్పగా, గతంలో కౌన్సిల్ సభ్యులే తీర్మానం చేశారని శానిటరీ ఇన్స్పెక్టర్ పకీర్రాజు సమాధానం ఇచ్చారు. వలంటీర్లకు జీతాలు అంతటా ఇచ్చారని మున్సిపాల్టీలో తక్షణం ఇవ్వాలని చైర్పర్సన్ వంగపండు అప్పలనాయుడు కోరారు. తాము ఏ సమస్య చెప్పినా అస్సలు పట్టించుకోవటం లేదని పలువురు ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.