ఎంపీఎఫ్సీ గోదాములు వినియోగంలోకి తేవాలి
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:23 PM
ఎంపీఎఫ్సీ గోదాములను రెండువారాల్లో వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు.
-కలెక్టర్ అంబేడ్కర్
కలెక్టరేట్, జూలై 26: ఎంపీఎఫ్సీ గోదాములను రెండువారాల్లో వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ (డీఎల్ఐసీ)సమావేశం శుక్రవారం కలెక్టర్ చాంబర్లో నిర్వహించారు. జిల్లాలో మొత్తం 44 ఎంపీఎఫ్సీ గోదాముల నిర్మాణాలను ప్రారంభించా మని, వీటిలో ఇప్పటి వరకూ 23 భవనాలు పూర్తి చేసినట్లు జిల్లా ఇన్చార్జి సహకార అధికారి ఎస్.రామ్మూర్తి తెలిపారు. ఒక్కొక్క భవనాన్ని రూ.40 లక్షలు వ్యయంతో నిర్మించినట్లు చెప్పారు. దీనిలో 90 శాతం నాబార్డు రుణం, మిగిలిన 10 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. 41 గోదాములు 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యమని, గుషిణి, తమ్మాపురం, వేపాడ గోదాములు మాత్రం వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యమని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే పూర్తయిన 23 గోదాములను వెంటనే వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ కార్తీక్ను ఆదేశించారు. ఈ ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలకు నిర్ణీత గడువు విధించి పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ బిల్లుల మంజూరుకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ రామారావు, ఉద్యానశాఖ డీడీ జమదగ్ని, నాబార్డు డీడీఎం నాగార్జున, డీసీసీబీ సీఈవో ఉమామహేశ్వరరరావు, మార్కెటింగ్ ఏడీ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.