శరణు శరణు పోలమాంబ
ABN , Publish Date - Feb 27 , 2024 | 11:53 PM
శంబర ఆరో వారం జాతరకు భక్తులు పోటెత్తారు. మంగళవారం అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు.
మక్కువ/సాలూరు రూరల్, ఫిబ్రవరి 27: శంబర ఆరో వారం జాతరకు భక్తులు పోటెత్తారు. మంగళవారం అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు. ఉదయం నుంచే భక్తజనం తాకిడి కనిపించింది. సుమారు 20 వేల మందికి పైబడి రావడంతో క్యూలైన్లు అన్ని కిక్కిరిసిపోయాయి. దీంతో క్యూలైన్లు దాటి రోడ్డుపై భక్తులు గంటలకొద్దీ నిరీక్షించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గోముఖీ నది తీరం, వనం గుడి వద్ద కూడా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారికి పూజలు చేశారు. కొందరు గ్రామ సమీపంలోని తోటల్లోనే వంటలు చేసుకొని భోజనాలు చేశారు. ఇదిలా ఉండగా సాలూరు ఆర్టీసీ డిపో నుంచి శంబరకు ఏడు బస్సులను నడిపారు. ప్రైవేట్ వాహనాలు కూడా నడిచాయి. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత విధులు నిర్వహించారు.