ఆ సిగ్నళ్లు అందాలంటే..
ABN , Publish Date - Oct 23 , 2024 | 11:55 PM
జిల్లాలోని గిరి శిఖర గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా సమాచార వ్యవస్థ సక్రమంగా లేదు. దీంతో గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీతంపేట ఏజెన్సీలో 40కి పైగా బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది.
4జీ ఫోన్లు ఉండాల్సిందే!
- సీతంపేట అధునాతన బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటు
- కీ ప్యాడ్ మొబైళ్లకు రాని సిగ్నళ్లు
- గిరిజనులకు తప్పని ఇబ్బందులు
- 4జీ, 5జీ ఫోన్లు కొనుక్కోవాలంటున్న అధికారులు
సీతంపేట రూరల్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరి శిఖర గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా సమాచార వ్యవస్థ సక్రమంగా లేదు. దీంతో గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీతంపేట ఏజెన్సీలో 40కి పైగా బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. టవర్ల ఏర్పాటు కూడా చాలా వరకు పూర్తయింది. అంతే కాకుండా ఇప్పటికే 20 టవర్ల నుంచి సిగ్నళ్లను విడుదల చేసి సామర్థ్య పరీక్షలను కూడా అధికారులు నిర్వహించారు. రానున్న సంక్రాంతికి అన్ని టవర్ల నుంచి పూర్తిస్థాయిలో సిగ్నళ్లను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ టవర్లు ఆధునాతన టెక్నాలజీతో నిర్మించడంతో పెద్ద చిక్కొచ్చింది. ఈ సిగ్నళ్లు కావాలంటే ప్రజల వద్ద 4జీ, 5జీ మొబైళ్లు తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే సిగ్నళ్లు అందవు. టవర్ల నుంచి 700 మెగాహెడ్జ్ బాండ్ ఫ్రీక్వెన్సీతో విడుదలవుతున్న సిగ్నళ్లను క్యాచ్ చేసే సామర్థ్యం కలిగిన 4జీ,5జీ ఫోన్లను వినియోగించే ఆర్థిక స్థోమత ఈ ప్రాంత గిరిజన ఆదివాసీలకు లేదు.
కొండ శిఖర గ్రామాల్లో నివసిస్తున్న 60శాతం మంది ఆదివాసీలకు టచ్ మొబైల్ అంటేనే తెలియని పరిస్థితి ఉంది. వారి కీ ప్యాడ్ మొబైల్కి కాల్ వస్తే హలో..హలో అని మాట్లాడటమే తప్ప మరింకా ఏమి తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు ఏ మేరకు ఈ బీఎస్ఎన్ఎల్ సేవలు ఉపయోగపడతాయో అధికారులకే ఎరుక. బీఎస్ఎన్ఎల్ టవర్లతో పాటు ప్రైవేటు సంస్థలైన ఎయిర్టెల్, జియో టవర్లను కూడా నిర్మిస్తున్నారు. ఈ టవర్ల ఫ్రీక్వెన్సీ ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి మరి.
సంక్రాంతికి పూర్తిస్థాయిలో సేవలు
సీతంపేట ఏజెన్సీలో 40కి పైగా బీఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేశాం. 20 టవర్లకు సామర్థ్య పరీక్షలు నిర్వహించి ఇన్స్టాలేషన్ చేశాం. మిగిలిన వాటికి కూడా సామర్థ్య పరీక్షలు నిర్వహించి వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో గిరి శిఖర గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలు అందిస్తాం. అంతే కాకుండా సాంకేతిక సామర్థ్యం అప్గ్రేడ్ అవుతోంది. దానికి అనుగుణంగా ముందుకు పోవాలి. కొండ చివర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఈ బీఎస్ఎన్ఎల్ సిగ్నళ్లు రావాలంటే వారు 4జీ, 5జీ ఫోన్లకు అప్డేట్ అవ్వాలి.
-వెంకటప్రసాద్, టెలికాం, జేఈ