విషాదం
ABN , Publish Date - Sep 30 , 2024 | 12:01 AM
మండలంలోని తిత్తిరి పంచాయతీ బల్లేరుగూడ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
- ఒకరికి తీవ్ర గాయాలు
కురుపాం రూరల్, సెప్టెంబరు 29: మండలంలోని తిత్తిరి పంచాయతీ బల్లేరుగూడ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆగంగూడకు చెందిన బిడ్డిక జాన్ (46) చర్చి పాస్టర్గా పని చేస్తున్నారు. ఈయన తన భార్య ఎమేరీతో కలసి ద్విచక్ర వాహనంపై చర్చికి వెళ్తున్నారు. అలాగే, ఆవిరి గ్రామానికి చెందిన బిడ్డిక శ్రీను (23), తన స్నేహితుడు కలసి వేరే గ్రామంలో పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నారు. బల్లేరుగూడ సమీపంలో రెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటలో జాన్, శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. జాన్ భార్య ఎమేరీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. శ్రీను స్నేహితునికి ఎటువంటి గాయాలు కాలేదు. ఎస్ఐ నీలకంఠరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాన్, శ్రీను మృతితో వారి గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.