Share News

AP Voters : దుమ్మురేపిన ఓటర్‌!

ABN , Publish Date - May 16 , 2024 | 04:40 AM

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్‌ ప్రక్రియలో ఏపీ టాప్‌లో నిలిచింది. సోమవారం జరిగిన

AP Voters : దుమ్మురేపిన ఓటర్‌!

ఓటింగ్‌ 81.86%.. గతంలోకంటే 1.98% అధికం

అసెంబ్లీ సెగ్మెంట్లలో 90.91 శాతంతో దర్శి టాప్‌

అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం

పార్లమెంటు స్థానాల్లో 87.06%తో ఒంగోలు ఫస్ట్‌

విశాఖలో అత్యల్పంగా 71.11% పోలింగ్‌

పట్టణాల్లో గతం కంటే 2.09% అధికం

142 స్థానాల్లో అతివలదే ‘నిర్ణయం’

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్‌ ప్రక్రియలో ఏపీ టాప్‌లో నిలిచింది. సోమవారం జరిగిన పోలింగ్‌లో మొత్తంగా 81.86 శాతం ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిలో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.2 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపింది. 2019 ఎన్నికలతో పోల్చితే ఈసారి 1.98 శాతం పోలింగ్‌ పెరగడం గమనార్హం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో 4,13,33,702 మంది ఓటర్లు ఉండగా వారిలో 3,33,40,560 మంది ఓటర్లు తాజా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంల ద్వారా ఓటేసిన వారిలో పురుషులు 1,64,30,359 మంది ఉండగా, మహిళలు 1,69,08,684 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 1,517 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 25 పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చూస్తే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం పోలైన ఓట్ల కన్నా 227 మంది ఓటర్లు పార్లమెంటుకు అధికంగా ఓటు హక్కు వినియోగించున్నారు. 2019 ఎన్నికల్లో 3.07 కోట్ల ఓటు వేయగా.. ఈసారి 26 లక్షల మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో మొత్తం ఓటేసిన వారి సంఖ్య 3,33,40,560కు చేరింది.

4.97 లక్షల మంది ఉద్యోగులు

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, సర్వీసు ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.2 శాతం పోలింగ్‌ నమోదైంది. పోస్టల్‌ బ్యాలెట్‌తో కలుపుకుంటే 81.86గా పోలింగ్‌ నమోదైంది. వీరిలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు 4.44 లక్షల మంది, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 13,700 మంది, దివ్యాంగులు 12,700, అత్యవసర సర్వీసు ఓటర్లు 27,100 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకోగా ఈసారి 4.97 లక్షల మంది ఓటేశారు. 3,500 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల దాటాక కూడా పోలింగ్‌ కొనసాగింది. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్‌ పెరిగింది. 2019తో పోలిస్తే ఈసారి 1 శాతం ఈవీఎం ఓటింగ్‌లోనే పెరిగింది.


పోలింగ్‌ నమోదులో..

ఒంగోలు పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 87.06 శాతం పోలింగ్‌తో మొదటి స్థానంలో నిలిచింది. 85.77 శాతం పోలింగ్‌తో చిత్తూరు రెండో స్థానంలో, 85.65 శాతం పోలింగ్‌తో నరసరావుపేట మూడోస్థానంలో నిలిచాయి. అత్యల్పంగా విశాఖపట్నం పార్లమెంట్‌ స్థానంలో 71.11 శాతం ఓటింగ్‌ నమోదైంది. తర్వాత స్థానంలో అరకు(73.68%), మూడో స్థానంలో శ్రీకాకుళం(74.43%) ఉన్నాయి.

దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్‌ నమోదైంది. 89.89 శాతం ఓటింగ్‌తో జగ్గయ్యపేట రెండవ స్థానం, 89.88 శాతం పోలింగ్‌తో కుప్పం మూడోస్థానంలో నిలిచాయి. అత్యల్పంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో 63.32 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో స్థానంలో విశాఖపట్నం సౌత్‌(63.42%), మూడవ స్థానంలో కర్నూలు(63.75%) నిలిచాయి.

పట్టణాల్లో క్యూకట్టిన ఓటరు

పట్టణ నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూతులకు ఓటరు క్యూకట్టాడు. దీంతో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం పెరిగింది. అయితే.. ఒక్క తిరుపతిలో మాత్రం పోలింగ్‌ శాతం తగ్గింది. గత ఎన్నికల్లో ఇక్కడ 65.9 శాతం పోలింగ్‌ నమోదుకాగా, ఈసారి 63.32 శాతమే నమోదైంది. ఆ నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం ఈసారి తగ్గడానికి కారణం బోగస్‌ ఓట్లను నియంత్రించడమేనని సీఈవో మీనా తెలిపారు.

నియోజకవర్గాల్లో పోటెత్తిన ఓట్లు

  • 16 పార్లమెంటు స్థానాల్లో 80-90% పోలింగ్‌.

  • 9 పార్లమెంటు స్థానాల్లో 80% కన్నా తక్కువ.

  • 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80-90 శాతంపైగా పోలింగ్‌ నమోదైంది.

  • 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70-80 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 17 నియోజకవర్గాల్లో 63-70% నమోదైంది.

  • 142 అసెంబ్లీ స్థానాల్లో పురుష ఓటర్ల కంటే అధికంగా మహిళా ఓటర్లు పోటెత్తారు.

  • 26 నియోజకవర్గాల్లో 75-80 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 15 నియోజకవర్గాల్లో 70-75 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • మొత్తంగా 158 నియోజకవర్తాలో 70% పైన ఓటింగ్‌ జరిగింది.

Updated Date - May 16 , 2024 | 04:40 AM