ప్రకృతి వ్యవసాయంపై బంగ్లాదేశ్ బృందం ప్రశంస
ABN , Publish Date - Jan 21 , 2024 | 01:24 AM
రైతు సాధికార సంస్ధ ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని బంగ్లాదేశ్ బృందం సభ్యులు అకోండ్ మహ్మద్, తాఫిక్ హసన్, అప్రినా సుల్తానా తదితరులు ప్రశంసించారు.
చాట్రాయి, జనవరి 20: రైతు సాధికార సంస్ధ ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని బంగ్లాదేశ్ బృందం సభ్యులు అకోండ్ మహ్మద్, తాఫిక్ హసన్, అప్రినా సుల్తానా తదితరులు ప్రశంసించారు. జనార్దనవరంలో శనివారం బంగ్లాదేశ్ బృందం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడింది. ప్రకృతి వ్యవసాయ హెల్త్ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి పొలంలో ఉన్న న్యూట్రీ గార్డెన్ను సందర్శించారు. ఇందులో పండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సొంత అవసరాలకు పోను అంగ న్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న విధానాన్ని అడిగితెలుసుకున్నారు. అనం తరం కొత్తపల్లి చంద్రకాంతమ్మ అనే మహిళ పెరటితోటను పరిశీలించగా ఇంటి అవసరాలకు సరిపడ కూరగాయలు, ఆకుకూరలను ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు వాడకుండా పండించి ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు ఆమె వివరించింది. మిచౌంగ్ తుఫాను తాకిడిని కూడా తట్టుకొని ప్రకృతి వ్యవసాయ పంటలు నిలబడ్డాయని ప్రాజెక్టు జిల్లా మేనేజర్ తాతారావు, వ్యవసాయాధికారి శివశంకర్ బృందానికి వివరించారు. తమ దేశంలో కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అమలు చేస్తామని బృందం తెలిపింది. మాజీ సర్పంచ్ పామర్తి నాగేశ్వరరావు, రైతు సాధికార సంస్థ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.