నరసాపురం–మచిలీపట్నం రైల్వే లైన్కు సానుకూలం
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:14 AM
నరసాపురం మచిలీపట్నం మధ్య ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన కొత్త రైల్వేలైన్ నిర్మాణంపై రైల్వే చేపట్టిన సర్వే అనుకులంగా ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ చెప్పారు.
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ
నరసాపురం, సెప్టెంబరు 20: నరసాపురం మచిలీపట్నం మధ్య ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన కొత్త రైల్వేలైన్ నిర్మాణంపై రైల్వే చేపట్టిన సర్వే అనుకులంగా ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ చెప్పారు. నరసాపురంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మొగల్తూరు– బంటుమిల్లు మీదుగా మచిలీపట్నం వరకు చేపట్టే కొత్త రైల్వేలైన్కు అయ్యే ఖర్చు, భూసేకరణ, ప్రయాణికుల రద్దీ, ఇతర రూట్లలోని మార్గాలతో అనుసంధానం తదితర అంశాలపై రైల్వే ప్రాథమిక సర్వే చేసిందన్నారు. మరో 15 రోజుల్లో ఈ నివేదిక ఢిల్లీలోని రైల్వే బోర్డుకు వెళ్లుతుందన్నారు.తరువాత ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్ వస్తుందని మంత్రి చెప్పారు.రాష్ట్ర విభజన తరువాత ఏపీ నుంచి వారాణసీ వెళ్లేందుకు ప్రత్యేక రైలు లేదు, ప్రస్తుతం విశాఖ నుంచి ఒక రైలు నడుస్తున్నా అది విజయనగరం జిల్లా వాసులకే తప్ప మిగిలిన జిల్లా వాసులకు పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. దీన్ని పరి గణలోకి తీసుకుని నరసాపురం నుంచి నడపాలని రైల్వే మంత్రిని కోరినట్లు శ్రీనివాసవర్మ చెప్పారు. లేదా నరసాపురం నుంచి మరో రైలును నడిపితే ఉభయగోదావరి జిల్లా వాసులతో పాటు కృష్ణా, గుంటూరు ఇతర జిల్లా వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే మంత్రి దృష్టికి తీసు కెళ్లామన్నారు. వీటితో పాటు నరసాపురం నుంచి వందే భారత్ నడపాలని కోరామన్నారు. ఇది కాకుండా చెన్నై విజయవాడల మధ్య నడుస్తున్న వందే భారత్ నరసాపురం లేదా భీమవరం వరకు పొడిగించాలని విన్నవిం చామన్నారు. మరో మూడు నెలల్లో వీటిపై క్లారిటీ వస్తుందని చెప్పారు. ఇవికాకుండా నరసాపురం నుంచి ప్రతి ఆదివారం హైద్రాబాద్కు నడుస్తున్న స్పెషల్, వీక్లి బెంగుళూరు స్పెషల్ను కూడా రెగ్యూలర్ చేయాలని మంత్రిని కోరా మన్నారు. కోటిపల్లి రైల్వేలైన్ పనులు గత ప్రభుత్వ హయంలో నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. రాష్ట్రవాటాగా ఒక్క రూపాయి కూడా వైసీపీ చెల్లించలేదన్నారు. ఇప్పటి వరకు రైల్వే ఈ ప్రాజెక్టుకు రూ.1200 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కోనసీమ జిల్లాలో భూసేకరణ పెండింగ్ పడిందన్నారు. దిగమర్రు నుంచి పామర్రు వరకు చేపట్టే 165 జాతీయ రహదారి పనుల్ని వేగవంతం చేస్తామన్నారు. భీమ వరం, ఉండి రహదారిలో పెండింగ్ పడిన వంతెన పనుల్ని వచ్చే నెలలో మొదలు పెడతామని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే నాయకర్, ఆర్డీవో అంబ రీస్, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడు, పీవీఆర్లు పాల్గొన్నారు.