దేవదాయ శాఖ ఆస్తులను పరిరక్షించాలి
ABN , Publish Date - Apr 06 , 2024 | 11:59 PM
దేవదాయ భూములను, శాఖ ఇతర ఆస్తులను మన సొంత ఆస్తులను కాపాడుకునే రీతిలో ప్రతీ ఈవో పరిరక్షించాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సూచించారు.
రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 6:దేవదాయ భూములను, శాఖ ఇతర ఆస్తులను మన సొంత ఆస్తులను కాపాడుకునే రీతిలో ప్రతీ ఈవో పరిరక్షించాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సూచించారు. స్థానిక మాధవ కల్యాణమండప ఆవరణలో శనివారం కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు, కాకినాడ డివిజన్లోని 6(ఏ)(బి)(సి)(ఇ) ఆలయాల్లో, ధర్మసత్రాలలో పనిచేసే ఈవోలు, మేనేజర్లు, డివిజినల్ ఇన్స్పెక్ట ర్లు, ఇంజనీర్లకు ఆయన దేవాలయ భూములు, ఇతర ఆస్తుల పరిరక్షణ, రీసర్వేపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో భూముల రీసర్వే, ఆడిట్, గడచిన మూడేళ్లలో ఆలయానికి వచ్చిన ఆదాయం, ఖర్చులు ఇతర అంశాలపై చర్చించారు. ఆలయాలకు ఆదాయం చేకూర్చే అంశాలు, భూముల వివరాలు, భూసేకరణ, ఆభరణాలు, బంగారం ఇతర వస్తువుల భద్రతపై చర్చించారు. ఏ అధికారి అలసత్వం వహించవద్దని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవదాయశాఖ ఏడీసీ రామచంద్రమోహన్, జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్, ఈవో వేండ్ర త్రినాథరావు, డీసీ విజయరాజు తదితరులు పాల్గొన్నారు.