విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:43 AM
నూజివీడు ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ కార్యదర్శి, రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ ట్రిపుల్ ఐటీ అధికారులను ఆదేశించారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీని పరిశీలించిన అధికారుల బృందం
నూజివీడు/నూజివీడు టౌన్, సెప్టెంబరు 20 : నూజివీడు ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ కార్యదర్శి, రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ ట్రిపుల్ ఐటీ అధికారులను ఆదేశించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్న కారణంగా రెండు నెలలుగా వారు అనారోగ్యం బారిన పడడం, విద్యార్థుల ఫిర్యాదుపై జిల్లా అధికారులు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మిక తనిఖీలు చేసి ఆహారం నాణ్యత లేదని నిర్ధారించి, నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఉన్నతాధికారుల కమిటీ బృందం శుక్రవారం ట్రిపుల్ ఐటీని సందర్శించింది. కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలసి భాస్కర్ ఒకటో నంబరు మెస్ను అక్కడ ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెస్లో భోజన పదార్థాల తయారీ విధానం పారిశుధ్య నిర్వహణ, ఆహార తయారీకి వినియోగించే సరుకుల నాణ్యతను పరిశీలించారు.
అధికారులతో సమీక్ష
అనంతరం సమావేశపు హాలులో శుక్రవారం ట్రిపుల్ ఐటీ అధికారులు, కలెక్టర్తో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. పూర్తిస్థాయి ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. మెస్ కాంట్రాక్టర్ను మార్చి కొత్త టెండర్లు పిలవాలి. ఇందుకు కమిటీని నియమించి ప్రభుత్వ నిబంధనలు అమలు చేసేవారికే మెస్ కాంట్రాక్ట్ అప్పగించాలి. ఆహార నాణ్యతను, పారిశుధ్యాన్ని పర్యవేక్షించటానికి కమిటీలు ఏర్పాటు చేయాలి. కమిటీలో పౌష్టికాహార నిపుణులు, ట్రిపుల్ ఐటీ అధికారులు, విద్యార్థుల ప్రతినిధులు సభ్యులుగా ఉండాలి. కమిటీ ప్రతి వారం సమీక్షించి ఆహార తయారీ, సరుకుల నాణ్యతను యాప్లో నమోదు చేయాలి. నాణ్యతలో లోపాలుంటే వెంటనే కాలేజీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావాలి. ప్రాంగణంలో సీసీ కెమేరాల పర్యవేక్షణ ఉండాలి’అని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కళాశాల విద్యాశాఖ కమిషనర్, ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్, సంబంధిత జిల్లా కలెక్టర్తో కమిటీని నియమించిందన్నారు. నాణ్యమైన భోజనం, మెరుగైన సౌకర్యాల కల్పనకు, సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొంది స్తామన్నారు. జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మెన్ రామ్మోనరావు, ఆర్డీవో భవానిశంకరి, వైస్ ఛాన్స్లర్ ఎం.విజయ్కుమార్, రిజిస్ట్రార్, ఇన్చార్జి డైరెక్టర్ అమరేంద్రకుమార్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి బండి ప్రసాద్, ఇన్చార్జ్ తహసీల్దార్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.