Share News

లెక్క తేలుద్దాం

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:29 AM

వైసీపీ హయాంలో మంజూరుచేసిన టీడీఆర్‌ బాండ్‌ల కుంభకోణం గుట్టు రట్టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీచేసింది.

లెక్క తేలుద్దాం

తణుకు, తాడేపల్లిగూడెంలో టీడీఆర్‌ గుట్టు విప్పేందుకు ప్రభుత్వం సిద్ధం

సీబీసీఐడీ విచారణకు ఆదేశం

బట్టబయలు కానున్న వైసీపీ నేతల బండారం

ఇప్పటికే తణుకులో అధికారుల బలి.. బ్లాక్‌ లిస్ట్‌లో బాండ్‌లు

తాడేపల్లిగూడెంలోనూ అధికారులపై వేటు తప్పదు

వైసీపీ హయాంలో మంజూరుచేసిన టీడీఆర్‌ బాండ్‌ల కుంభకోణం గుట్టు రట్టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీచేసింది. నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీసీఐడీ రంగంలోకి దిగుతోంది. తణుకులో జరిగిన కుంభకోణంపై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శాసనసభలో ప్రస్తావించారు. తాడేపల్లిగూడెం కుంభకోణంపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జి మున్సిపల్‌ అధికారులకు వివరాలు అందజేశారు. దీంతో ప్రభుత్వం విశాఖపట్నం, తిరుపతి, తణుకులతోపాటు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోనూ ఈ కుంభకోణం నిగ్గు తేల్చాలని సీబీసీఐడీని ఆదేశించింది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

వైసీపీ ప్రభుత్వ హయాంలో తణుకు మునిసిపాలిటీలో కంపోస్ట్‌ యార్డు విస్తరణ కోసం ఆరు ఎకరాలను కొనుగోలు చేశారు. ఎకరానికి కోటి రూపాయలు చెల్లించేలా స్థల యజ మానులతో మునిసిపాలిటీ ఒప్పందం కుదిరింది. ఇంత వరకు బాగానే వుంది. కాని తర్వాత మున్సిపాలిటీ దానిని గజాల్లో మార్చేసి, గజం ధర రూ.20 వేలుగా నిర్ణయించింది. రహదారులు విస్తరించాలనుకున్నప్పుడే మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా స్థలాలను సేకరిస్తారు. ఇందుకోసం స్థల యజమానులకు గజానికి నాలుగు రెట్లు విలువైన బాండ్‌లు జారీచేస్తారు. కానీ తణుకులో కంపోస్ట్‌ యార్డు కోసం ముందుగానే స్కెచ్‌ వేసి భూమిని గజాల్లో సేకరించారు. సెంటుకు 48 గజాల వంతున ఎకరానికి 4,800 గజాలుగా నిర్ణయించారు. ఇందుకోసం నాలుగు రెట్లు టీడీఆర్‌ బాండ్‌లు జారీచేశారు. ఒక్కో గజానికి రూ.20 వేల ధరతో బాండ్‌లు మంజూరయ్యాయి. అంటే ఎకరం విలువ రూ.38 కోట్లు ధర అయ్యింది. కేవలం కోటి రూపాయల విలువ చేసే భూమిని రూ.38 కోట్ల విలువతో మున్సిపాలిటీ సేకరించిందన్న మాట. కంపోస్ట్‌ యార్డు కోసం గజాల రూపంలో సేకరించి టీడీఆర్‌ బాండ్‌లు జారీ చేయడం ఒక తప్పిదమైతే రిజిస్ర్టేషన్‌ చేయకుండానే ఒప్పందం చేసుకున్న వారి పేరుతో మంజూరు చేయడం మరో తప్పిదం. ఈ విషయంలో వైసీపీ నేత కీలకంగా వ్యవహరించారు.

కొత్త రహదారి ఏర్పాటు, గ్రీన్‌ ఫీల్డ్‌ అంటూ మరో తొమ్మిది ఎకరాల భూమికి బాండ్‌లు జారీ అయ్యాయి. మొత్తంగా 21 ఎకరాలకు రూ.900 కోట్ల విలువైన బాండ్‌లు జారీ అయ్యా యి. అప్పట్లో టీడీపీ గట్టి పోరాటం చేయడంతో ప్రభుత్వం తూతూమంత్రంగా దర్యాప్తు చేపట్టింది. తక్షణం మునిసిపల్‌ కమిషనర్‌, టీపీవోలను సస్పెండ్‌ చేశారు. బాండ్‌లను బ్లాక్‌ లిస్టులో పెట్టారు. బాండ్‌ల మంజూరులో కీలకపాత్ర పోషిం చిన వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు లేవు. బాండ్‌ల కొనుగోలు చేసిన వారంతా రోడ్డున పడ్డారు. ఇప్పుడు వీటిపై సీబీసీఐడీ దర్యాపు జరగనుంది. టీడీపీ కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత టీడీఆర్‌ బాండ్‌లపై పట్టు బిగించింది. బాండ్‌ల జారీతోపాటు, అమ్మకం నిర్వహించిన వారు బలి కానున్నారు. వైసీపీ నేత ఖాతాలోనూ నేరుగా జమ అయితే ఆయనపైనా చర్యలు ఉండే అవకాశం ఉంది.

తాడేపల్లిగూడెంలో నేతకే ముడుపులు

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ముగ్గురు కమిషనర్‌లు రహదారి విస్తరణ పేరుతోనే టీడీఆర్‌ బాండ్‌లు జారీచేశారు. లబ్ధి మాత్రం వైసీపీ నేతకు దక్కింది. కోట్ల రూపాయలు పోగేసుకున్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో కూటమి నేతల లెక్కల ప్రకారం రూ.142 కోట్ల విలువైన బాండ్‌లు జారీచేశారు. అధికారులు మాత్రం రూ.82 కోట్ల విలువైన బాండ్‌లు జారీచేసినట్టు లెక్కలు చెబుతున్నారు. తాడేపల్లిగూ డెంలోనూ స్థల యజమానుల పేరుతో కాకుండా ఒప్పందం చేసుకున్న వారితో బాండ్‌లు జారీ అయిన ఉదంతాలు ఉన్నా యి. వైసీపీ నేత మున్సిపల్‌ అధికారుల మెడపై కత్తిపెట్టారు. ఉన్నతాధికారులతో ఒత్తిడి పెంచారు. బాండ్‌లు మంజూరు చేయించారు. ప్లాన్‌ లేకుండా వైసీపీ నేత కల్యాణ మండపం నిర్మించారు. అదే స్థలంలో రహదారి విస్తరణ అంటూ వైసీపీ నేత పేరుతో బాండ్‌లు మంజూరుచేశారు. తెలుగుదేశం నాయకులు పట్టుబడితే అక్కడ స్థలాన్ని సేకరించినట్టు హద్దులు గీశారు. మిగిలినచోట్ల ఎక్కడా స్థలాలను సేకరించ కుండానే బాండ్‌లు జారీ అయ్యాయి. అటువంటి చోట్ల వ్యాపార సముదాయాలు వున్నాయి. ఇప్పటికీ వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. రహదారి విస్తరిస్తేనే స్థల సేకరణ ఆవశ్యకత ఉంటుంది. రహదారి విస్తరణ జరగదని తెలిసే మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో 100 అడుగులకు బాండ్‌లు జారీ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం–భీమవరం రహదారి వెంబడి మున్సిపాలిటీ ఇటువంటి దందా సాగించింది. ఇప్పుడు సీబీసీ ఐడీ దర్యాప్తునకు ఆదేశించడంతో అధికారుల వెన్నులో వణు కు పుడుతోంది. బాండ్‌లు జారీచేసిన అధికారులు ఇతర చోట్లకు బదిలీపై వెళ్లిపోయారు. వారంతా కూటమి నేతలతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది. కూటమి నేతలకు వివరాలు ఇవ్వకూడదంటూ వైసీపీ నేత ఒత్తిడి పెం చారు. సమాచార చట్టం, ఇతర మార్గాల్లో వివరాలు సేకరిం చారు. వాటిని మున్సిపల్‌ శాఖకు సమర్పించారు. సీబీసీఐడీ దర్యాప్తు చేసేలా ప్రయత్నాలు చేశారు. అందుకు తగ్గట్టుగానే సీబీసీఐడీకి ఆదేశాలు జారీచేసింది. త్వరలోనే ఈ రెండు మునిసిపాలిటీల్లో గట్టు రట్టుకానుంది.

Updated Date - Jul 27 , 2024 | 12:29 AM