Chennai: బీమా సొమ్ము కోసం.. స్నేహితుడి దారుణ హత్య
ABN , Publish Date - Jan 03 , 2024 | 08:57 AM
కోటి రూపాయల కోసం స్నేహితుడిని హత్య చేసి, తాను చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రయత్నించిన కేసులో ప్రధాన నిందితుడి సహా ముగ్గురిని నగర పోలీసులు అరెస్టు చేశారు.
- ముగ్గురి అరెస్టు
అడయార్(చెన్నై): కోటి రూపాయల కోసం స్నేహితుడిని హత్య చేసి, తాను చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రయత్నించిన కేసులో ప్రధాన నిందితుడి సహా ముగ్గురిని నగర పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల చెంగల్పట్టు(Chengalpattu) జిల్లా అల్లనూరు సమీపంలో గుడిసెలో పూర్తిగా కాలిన మృతదేహాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఓరత్తి పోలీసులు కేసు నమోదు చేసి చెన్నై అయనావరం ప్రాంతానికి చెందిన సురేష్ (38)అనే వ్యక్తిని తొలుత అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో స్నేహితులు కృష్ణన్ (32), కీర్తిరాజన్ అనే వారికి కూడా సంబంధం ఉన్నట్టు తేలడంతో వారిని కూడా అరెస్టు చేశారు. మృతుడిని ఢిల్లీబాబుగా గుర్తించారు. ఇదిలావుండగా అయనావరంలోజిమ్ సెంటరులో ట్రైనరుగా పనిచేసే సురేష్... తన పేరుమీద కోటి రూపాయలకు బీమా చేసుకున్నాడు. ఈ సొమ్ము జీవించివుండగానే తనకు వచ్చేల్లా ప్లాన్ చేసి, తన వయస్సున్న స్నేహితుడు ఢిల్లీబాబుకు మాయమాటలు చెప్పి, చెంగల్పట్టుకు సమీపంలోని అల్లనూరులోని ఒక గుడిసెకు తీసుకెళ్ళాడు. అక్కడ సురేష్, కృష్ణన్, కీర్తిరాజన్, ఢిల్లీబాబు మద్యం తాగారు. అనంతరం ఢిల్లీబాబును హత్య చేసి పెట్రోల్ పోసి గుడిసెకు నిప్పంటిచారు. ఈ మంటల్లో కాలిపోయింది సురేషేనని మిగిలిన ఇద్దరు స్నేహితులు నమ్మించి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే, స్నేహితులతో వెళ్ళిన కుమారుడు ఢిల్లీబాబు ఇంటికి రాకపోవడంతో మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ జాప్యం జరగడంతో ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేసి, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆగమేఘాలపై విచారణ చేపట్టిన పోలీసులు.. సురేష్, కృష్ణన్, కీర్తిరాజన్ను తిరువళ్ళూరు జిల్లాలో అరెస్టు చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో బీమా సొమ్ముకోసం ఢిల్లీబాబును హత్య చేసినట్టు అంగీకరించారు.