Hyderabad: ప్రీ లాంచ్ పేరిట భారీ మోసం.. రూ. వందలకోట్లు కొల్లగొట్టిన భువనతేజ ఇన్ఫ్రా
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:48 PM
ఇటీవల సాహితీ ఇన్ఫ్రా ప్రై. లిమిటెడ్ పేరుతో వెలుగులోకి వచ్చిన రూ. 1500కోట్ల భారీ ప్రీలాంచ్ మోసాన్ని ప్రజలు మరచిపోక ముందే.. మరో భారీ ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది.
- మోసపోయిన 400 మంది వినియోగదారులు
- డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్ సిటీ: ఇటీవల సాహితీ ఇన్ఫ్రా ప్రై. లిమిటెడ్ పేరుతో వెలుగులోకి వచ్చిన రూ. 1500కోట్ల భారీ ప్రీలాంచ్ మోసాన్ని ప్రజలు మరచిపోక ముందే.. మరో భారీ ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భువనతేజ ఇన్ఫ్రా ప్రై. లిమిటెడ్ పేరుతో ప్రీ లాంచ్ ప్రాజెక్టును ప్రారంభించిన నిర్వాహకులు రూ.వందలకోట్ల భారీ మోసానికి తెరతీసినట్లు సీసీఎస్ పోలీసులు(CCS Police) గుర్తించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ చక్కా వెంకట సుబ్రహ్మణ్యంను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ సిటీ క్రైమ్స్ అండ్ సిట్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనతేజ ఇన్ఫ్రా నిర్వాహకులు శామీర్పేటలో హ్యాపీ హోమ్స్ పేరుతో తక్కువ ధరకే ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రీ లాంచ్ ఆఫర్ను ప్రవేశపెట్టారు. దాంతో 10మంది వినియోగదారులు రూ. 2.29కోట్లు చెల్లించి ఫ్లాట్లు కొనుగోలు చేసి, సేల్ డీడ్ చేసుకున్నారు. సంవత్సరాలు గడిచినా ఫ్లాట్లు నిర్మించకపోవడం, చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దాంతో జాయింట్ సీపీ రంగనాథ్, డీసీపీ శ్వేత పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బృందం రంగంలోకి దిగింది. ప్రాజెక్టు డైరెక్టర్ చక్కా వెంకట సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. అతన్ని విచారించిన క్రమంలో 400 మందికి పైగా కస్టమర్స్ను మోసం చేసి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితున్ని మరోసారి పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తే భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.