Hyderabad: ఒడిశా టూ హైదరాబాద్.. భారీగా గంజాయి తరలింపు
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:58 PM
ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న గంజాయిని టాస్క్ఫోర్స్, కంచన్బాగ్ పోలీసులు పట్టుకున్నారు.
- 31.34కిలోల గంజాయి పట్టివేత
- నలుగురి అరెస్ట్
చంపాపేట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న గంజాయిని టాస్క్ఫోర్స్, కంచన్బాగ్ పోలీసులు పట్టుకున్నారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ జి.శేఖర్రెడ్డితో కలిసి సౌత్ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ జి.మనోహర్ కేసు వివరాలను వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి 12:10గంటల ప్రాంతంలో కంచన్బాగ్ పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఫిసల్బండ ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కారు (నెంబర్ టీఎస్08 జీఎన్ 6166)ను ఆపి తనిఖీ చేయగా అందులో రూ.3.10లక్షల విలువైన 31.34కిలోల (15ప్యాకెట్లు) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న మైలార్దేవ్పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ అబ్దుల్ ఫైసల్(36), ఆసీఫ్ నగర్కు చెందిన కారు డ్రైవర్ ఎండీ సమీయోద్దీన్(32), శాస్త్రీపురానికి చెందిన ఎలక్ట్రిషన్ మహ్మద్ హమీర్(28), క్యాటరింగ్ ఈవెంట్ మేనేజర్గా పని చేస్తున్న హుస్నా ఫాతిమా అలియాస్ సాజిదా తబుసం(28)ను పోలీసులు అదులోకి తీసుకొని విచారించారు. ఒడిశాకు చెందిన రితీద్కు రూ. 56వేలకు గంజాయిని కొనుగోలు చేసినట్లు విచారణలో వారు తెలిపారు. ఒడిశా నుంచి అరుకు మీదుగా హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు. డీసీపీ బి.రోహిత్రాజు పర్యవేక్షణలో టాస్క్ఫోర్స్ డీసీపీ శ్రీబాల, అడిషనల్ డీసీపీ ఏవీఆర్ నర్సింహారావు, ఏసీపీ మనోజ్కుమార్ ఆదేశాల మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు, బుధవారం నలుగురిని రిమాండ్కు తరలించినట్లు, 5వ నిందితుడు రితీష్ పరారీలో ఉన్నట్లు, అతని కోసం ఒడిశాకు వెళ్లనున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 4సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకుని, గంజాయిని సీజ్ చేసినట్లు అడిషనల్ డీసీపీ జి.మనోహర్ తెలిపారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు, కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ జి.శేఖర్రెడ్డి, ఎస్ఐలు లింగరాజు, పద్మయ్య, హిమారెడ్డి, అనంతచారి, సాయిరాం, రాఘవేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.