Share News

Micronutrients: ప్రపంచంలో 60 శాతం మందికిపైగా చేస్తున్న తప్పు ఇది.. మీరు చేయొద్దు!

ABN , Publish Date - Sep 08 , 2024 | 12:01 PM

మంచి ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరం. కానీ ప్రపంచంలో ఏకంగా 60 శాతం మంది సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. తక్కువ మొత్తంలో అవసరమయ్యే పోషకాలు.. అంటే మైక్రోన్యూట్రియంట్స్ తగినంత మొత్తంలో తీసుకోవడం లేదని తేలింది.

Micronutrients: ప్రపంచంలో  60 శాతం మందికిపైగా చేస్తున్న తప్పు ఇది.. మీరు చేయొద్దు!

ఇంటర్నెట్ డెస్క్: మంచి ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరం. కానీ ప్రపంచంలో 60 శాతం మందికిపైగా ప్రజలు సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. తక్కువ మొత్తంలో అవసరమయ్యే పోషకాలు.. అంటే మైక్రోన్యూట్రియంట్స్ తగినంత మొత్తంలో తీసుకోవడం లేదని తేలింది. హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యూసీ సాంటా బార్బరా, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ సంస్థల పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వమించారు. పరిశోధకులే ఆశ్చర్యపోయే విషయాలు ఈ అధ్యయనంలో వెలుగు చూశాయి (Health).

Diabetes: స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా?


ఈ అధ్యయనం తాలూకు వివరాలు ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మ్యాగజీన్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో మైక్రోన్యూట్రియంట్ల లోపం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు జరిగిన తొలి అధ్యయనం ఇది. ఆరోగ్యానికి కీలకమైన కాల్షియం, ఐరన్, విటమిన్ సీ, ఈ అనే సూక్ష్మపోషకాల లోపంతో సగానికి పైగా ప్రపంచ జనాభా సతమతమవుతున్నట్టే తేలింది.

గ్లోబల్ డైటరీ డేటాబేస్, ప్రపంచ బ్యాంకు, 31 దేశాల్లో నిర్వహించిన ఆహార సర్వేల్లోని సమాచారం ఆధారంగా పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఆయా సంస్థల డేటాను క్రోడీకరించారు. డేటాలోని వ్యక్తులను వయసుల వారీగా 17 వర్గాలుగా విభజించారు. కాల్షియం, ఐయోడిన్, ఇరన్, రిబోఫ్లేవిన్, ఫోలేట్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, థయామిన్, నియాసిన్, విటమిన్ ఏ, బీ6, బీ12, సీ, ఈ పోషకాలు ఏ స్థాయిలో లోపించాయో అధ్యయనం చేశారు.


పరిశోధకులు దృష్టి సారించిన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ప్రజల్లో తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో బయటపడింది. ముఖ్యంగా..జనాభాలో ఏకంగా 68 శాతం మందిలో ఐయోడిన్ లోపం ఉన్నట్టు తేలింది. 67 శాతం మందిలో విటమిన్ ఈ, 66 శాతం మందిలో కాల్షియం, 65 శాతం మందిలో ఐరన్ తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. రిబోఫ్లేవిన్, ఫోలేట్, విటమిన్ సీ, బీ6 వంటి పోషకాల లోపం కూడా ఆందోళన కర స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. 22 శాతం జనాభాలో నియాసిన్ తక్కువగా ఉన్నట్టు బయటపడింది. 30 శాతం మంది థయామిన్, 37 శాతం మందిలో సెలీనియం లోపించినట్టు వెల్డైంది. గుండె, ఎముకలు, రోగనిరోధక శక్తి మెరుగ్గా పనిచేసేందుకు అవసరమైన మైక్రోపోషకాలు లోపించడంపై పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.


అయితే, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దీర్ఘకాలంలో ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడతారని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రజారోగ్య సమస్య కింద మారే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. పోషకాహారంపై అవగాహన లేక ఇలా జరుగుతోందని చెబుతున్నారు. న్యూట్రిషనిస్టులు, వైద్యులను సంప్రదించి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు.

Read Health and Telugu News

Updated Date - Sep 08 , 2024 | 02:11 PM