Manipur attack: మణిపూర్లో కాల్పులు, ఏడుగురు భద్రతా సిబ్బందికి గాయాలు.. మయన్మార్ ప్రమేయంపై అనుమానాలు
ABN , Publish Date - Jan 02 , 2024 | 03:02 PM
జాతుల ఘర్షణలతో ఇటీవల కాలంలో అడ్డుడికిన మణిపూర్లో మంగళవారంనాడు మళ్లీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. తోంగనోవ్పల్ జిల్లా మోరేహ్ జిల్లాలో గాలింపు చర్యలు జరుపుతున్న ఏడుగురు భద్రతా సిబ్బంది ఈ ఘటనలో గాయపడ్డారు.
ఇంఫాల్: జాతుల ఘర్షణలతో ఇటీవల కాలంలో అడ్డుడికిన మణిపూర్(Manipur)లో మంగళవారంనాడు మళ్లీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. తోంగనోవ్పల్ జిల్లా మోరేహ్ (Moreh) జిల్లాలో గాలింపు చర్యలు జరుపుతున్న ఏడుగురు భద్రతా సిబ్బంది ఈ ఘటనలో గాయపడ్డారు. దౌబల్ జిల్లాలో సోమవారంనాడు నలుగురు వ్యక్తులు హతులైన నేపథ్యంలో నౌట్ కర్ఫ్యూను అమలు చేసిన క్రమంలో తాజా ఘటన చోటుచేసుకుంది.
కమెండోలు ఇద్దరు నిరాయుధులైన పౌరులను కిడ్నాప్ చేసిన సమాచారంతో గుర్తుతెలియని సాయుధులకు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం కాల్పులు చోటుచేసుకున్నట్టు కుకీస్ అంబ్రెల్లా గ్రూప్కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు గంటలకు పైగా కాల్పులు జరిగినట్టు ఆయన చెప్పారు. ఛంవాగ్పాయ్ నుంచి ఇద్దరు నిరాయుధులైన పౌరులను తీసుకువెళ్లినట్టు ఆయన తెలిపారు. అయితే ఈ వార్తలను తోంగనోవ్పల్ పోలీస్ సూపరింటెండెంట్ లుయికం లాన్మియో తోసిప్చుచారు. దాడులతో ప్రమేయమున్న ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. డిప్యూటీ కమిషనర్ క్రిష్ణ కుమార్ మాట్లాడుతూ, ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు చోటుచేసుకున్నాయని, గాయపడిన భద్రతా సిబ్బందిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. ఐదుగురిని ఇంఫాల్లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లోనూ, ఇద్దరిని మోరేహ్లోనూ చేర్చినట్టు చెప్పారు. గాయపడిన వారిలో నలుగురు మణిపూర్ పోలీసు కమెండోలు, ముగ్గురు సరిహద్దు భద్రతా సిబ్బంది ఉన్నారు. కర్ఫ్యూ చర్యలపై మంగళవారంనాడు ఉన్నతాధికారులు సమీక్ష జరపాల్సి ఉండగా తాజా దాడి జరిగినట్టు చెబుతున్నారు.
మయన్మార్ ప్రమేయంపై సీఎం అనుమానాలు
కాగా, మోరెహ్ జిల్లాలో భద్రతా బలగాలపై దాడి ఘటనను ముఖ్యమంత్రి ఎన్.బీరీన్ సింగ్ ఖండించారు. ఉగ్రవాద సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో తిప్పికొడుతున్నామని, గాలింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పాుర. అదనపు బలగాలను కూడా పంపామన్నారు. మయన్మార్ నుంచి విదేశీ శక్తుల ప్రమేయాన్ని కూడా అనుమానిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి బెందరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని సీఎం స్పష్టం చేశారు.