హాస్టల్లో నమాజ్ చే సినందుకు విదేశీ విద్యార్థులపై దాడి
ABN , Publish Date - Mar 18 , 2024 | 03:42 AM
అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీ హాస్టల్లో నమాజ్ చేసినందుకు పలు దేశాలకు చెందిన విద్యార్థులపై కొంత మంది వ్యక్తులు దాడి చేసినట్టు ఆదివారం పోలీసులు తెలిపారు.
గుజరాత్ యూనివర్సిటీలో ఘటన.. ఇద్దరి అరెస్ట్
అహ్మదాబాద్, మార్చి 17: అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీ హాస్టల్లో నమాజ్ చేసినందుకు పలు దేశాలకు చెందిన విద్యార్థులపై కొంత మంది వ్యక్తులు దాడి చేసినట్టు ఆదివారం పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి ఏ-బ్లాక్ హాస్టల్లో జరిగిన ఘటనలో గాయపడిన శ్రీలంక, తజకిస్థాన్కు చెందిన ఇద్దరు విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చినట్టు చెప్పారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరిని క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసినట్టు అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. గుజరాత్ యూనివర్సిటీలో చదువుతున్న ఐదుగురు విదేశీ విద్యార్థులు నమాజ్ చేస్తుండగా దాడి ఘటన జరిగింది. వీరు ఉజ్బెకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, తజకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకకు చెందిన వారు. ఈ ఘటనలో 20-25 మందిపై ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేశామని, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టడానికి తొమ్మిది టీమ్లను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో హోం శాఖ సహాయమంత్రి హర్ష్ సంఘవి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే గుజరాత్ యూనివర్సిటీ హాస్టల్ ప్రాంగణంలోకి దాదాపు రెండు డజన్ల మంది ప్రవేశించి విదేశీ విద్యార్థులు నమాజ్ చేస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేశారని, మసీదులో నమాజ్ చేసుకోవాలన్నారని మాలిక్ తెలిపారు. దీనిపై వాదనకు దిగడమేకాకుండా వారిపై దాడి చేయడంతోపాటు రాళ్లు రువ్వారన్నారు. హాస్టల్ గదులను ధ్వంసం చేశారని చెప్పారు. ఈ ఘటనలో శ్రీలంక, తజకిస్థాన్కు చెందిన ఇద్దరు విద్యార్థు లు ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. ఈ ఘటనతో సంబం ధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాళ్లు రువ్వుతున్న వీడియోలు బయటకు వచ్చాయని చెప్పారు.