Calcutta High Court : బెంగాల్లో 77 ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు రద్దు
ABN , Publish Date - May 24 , 2024 | 05:36 AM
పశ్చిమ బెంగాల్లో 2010 నుంచి గత 14 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 114 వర్గాలను ఓబీసీల్లో చేర్చడాన్ని కలకత్తా హైకోర్టు తప్పుపట్టింది. ఆయా వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లను కొట్టేసింది. 2010 ఏప్రిల్ నుంచి ఆర్నెల్ల వ్యవధిలో అప్పటి కమ్యూనిస్టు
మరో 37 ఇతర ఓబీసీ కులాలకు కూడా..
కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
కోల్కతా, మే 23: పశ్చిమ బెంగాల్లో 2010 నుంచి గత 14 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 114 వర్గాలను ఓబీసీల్లో చేర్చడాన్ని కలకత్తా హైకోర్టు తప్పుపట్టింది. ఆయా వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లను కొట్టేసింది. 2010 ఏప్రిల్ నుంచి ఆర్నెల్ల వ్యవధిలో అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం 77 ముస్లిం వర్గాలకు(క్లాసెస్) రిజర్వేషన్లు ఇచ్చింది. వీటిని కోల్కతా హైకోర్టు కొట్టేసింది. మొత్తం ముస్లిములను ఓబీసీలుగా పరిగణించే ప్రయ త్నం జరిగిందని జస్టిస్ తపబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర మంథాలతో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది. రాజకీయ కారణాలతోనే ఈవర్గాలను బీసీలుగా పరిగణించే ప్రయత్నం జరిగిందని పేర్కొంది. 77వర్గాలను ఓటుబ్యాంకుగా పరిగణించే ఓబీసీలుగా గుర్తించారనేది జరిగిన సంఘటనల క్రమం స్పష్టం చేస్తోందని చెప్పింది. ఆ తర్వాత 2012 ఓబీసీ రిజర్వేషన్ చట్టం కింద తృణమూల్ ప్రభుత్వం గత పుష్కరకాలంలో మరో 37 వర్గాలను ఓబీసీలుగా గుర్తించడాన్నీ హైకోర్టు కొట్టేసింది. 1993నాటి ఓబీసీ కమిషన్ చట్టాన్ని అనుసరించి వీరిని ఓబీసీలుగా గుర్తించలేదని చెప్పింది. గత పధ్నాలుగేళ్లుగా 114వర్గాలకు ఇచ్చిన దాదాపు 5లక్షల ఓబీసీ కులధ్రువీకరణ పత్రాలను ధర్మాసనం రద్దు చేసింది. ఇప్పటికే ఆయా వర్గాలు రిజర్వేషన్ల కింద అందుకున్న ఫలాలను వెనక్కి తీసుకోరాదని చెప్పింది.