Share News

Congress : రాహుల్‌కు ఐదో వరుసలో సీటు

ABN , Publish Date - Aug 16 , 2024 | 05:33 AM

స్వాతంత్ర దినోత్సవాల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి ఐదో వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య సంప్రదాయాలపై ప్రధాని మోదీకి గౌరవం లేదని దీన్నిబట్టి అర్థమవుతుందని కాంగ్రెస్‌ మండిపడింది. కుచించుకుపోయిన మనస్తత్వం కలిగిన వ్యక్తుల

Congress : రాహుల్‌కు ఐదో వరుసలో సీటు

వేడుకల్లో ప్రతిపక్ష నేతను గౌరవించరా?

ప్రజాస్వామ్య సంప్రదాయాలపై మోదీకి గౌరవం లేదు: కాంగ్రెస్‌ ధ్వజం

న్యూఢిల్లీ, ఆగస్టు 15: స్వాతంత్ర దినోత్సవాల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి ఐదో వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య సంప్రదాయాలపై ప్రధాని మోదీకి గౌరవం లేదని దీన్నిబట్టి అర్థమవుతుందని కాంగ్రెస్‌ మండిపడింది. కుచించుకుపోయిన మనస్తత్వం కలిగిన వ్యక్తుల నుంచి పెద్ద పెద్ద విషయాలను ఆశించడం వృథా అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా వ్యాఖ్యానించారు. రాహుల్‌కి ఐదో వరుసలో సీటు కేటాయించి తన అసహనాన్ని ప్రధా ని మోదీ ప్రదర్శించుకున్నారని అయితే, ఈ పరిణామం ప్రజా సమస్యలపై రాహుల్‌ చేసే పోరాటంలో ఏ మార్పునూ తీసుకురాలేదని ఆమె పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతకు క్యాబినెట్‌ మంత్రి హోదా ఉంటుందని ఆ స్థానంలో ఉన్నవారికి మొదటి వరుసలో సీటు కేటాయించాలని, రాహుల్‌ ఒక్కరికే కాద ని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేకు కూడా ఐదో వరుసలోనే సీటు కేటాయించారని సుప్రియా మండిపడ్డారు. ఇక, పారిస్‌ ఒలింపిక్స్‌ పతాక విజేతలను గౌరవించుకోవడం కోసమే వారికి మొదటి వరుసలో సీట్లు కేటాయించామంటూ రక్షణశాఖ విడుదల చేసిన ప్రకటన అర్థం లేనిదని ఆమె ధ్వజమెత్తారు. అలాంటప్పుడు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నడ్డా, జైశంకర్‌, నిర్మలా సీతారామన్‌లకు మొదటి వరుసలో సీట్లు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. రాహుల్‌కు ఐదో వరుసలో సీటు ఇచ్చినా, 55వ వరుసలో సీటు కేటాయించినా ప్రజా నేతగా ఆయనకున్న గుర్తింపునకు ఏ ఇబ్బంది లేదని సుప్రియా స్పష్టం చేశారు.

పదేళ్ల తర్వాత వేడుకలకు విపక్ష నేత!

దశాబ్ద కాలం తర్వాత ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. పదేళ్లుగా లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎవరికీ ఇవ్వని విషయం తెలిసిందే. ఇక, రాహుల్‌ గాంధీకి ఐదో వరుసలో సీటు కేటాయించారన్న విమర్శల నేపథ్యంలో రెండో వరుసలో రాహుల్‌ కూర్చున్న వీడియోలు బయటకు వచ్చాయి. హాకీ టీమ్‌లోని గుర్జాంత్‌ సింగ్‌ పక్కన రాహుల్‌ కూర్చుని ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రాష్ట్రపతి ప్రసంగంలో నెహ్రూ పేరు లేదేం?

స్వేచ్ఛ అనేది మన అతి పెద్ద రక్షణ కవచమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. స్వేచ్ఛ అనేది ఒక పదం మాత్రమే కాదని, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన అతిపెద్ద రక్షణ కవచమని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో రాహుల్‌ పేర్కొన్నారు. ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న రాహుల్‌ ఆ తర్వాత ఏఐసీసీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక, రాష్ట్రపతి ప్రసంగంలో మాజీ ప్రధాని నెహ్రూ పేరు కూడా ప్రస్తావించకపోవడంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చరిత్ర నుంచి భారత దేశ మొదటి ప్రధాని పేరును చెరిపేయడమే లక్ష్యంగా సాగుతున్న కార్యక్రమంలో భాగంగానే ఆయన పేరును కూడా ప్రస్తావించడం లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు.

Updated Date - Aug 16 , 2024 | 05:33 AM