త్వరలో నలుగురి అరెస్టు
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:12 AM
ఆప్ మంత్రి ఆతిశీ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా నలుగురు ఆప్ సీనియర్ నాయకులను నెల రోజుల్లోగా అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు.
ఆప్ మంత్రి ఆతిశీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్2: ఆప్ మంత్రి ఆతిశీ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా నలుగురు ఆప్ సీనియర్ నాయకులను నెల రోజుల్లోగా అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. తనతో పాటు మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఎమ్మెల్యే దుర్గేశ్ పాథక్, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాలను అదుపులోకి తీసుకోవచ్చని ఆమె తెలిపారు. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్ అరెస్టు తర్వాత కూడా ఆప్ ఐక్యంగా ఉండటంతో మిగిలిన బలమైన నేతల్ని అరెస్టు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం కేజ్రీ కేసు విచారణలో భాగంగా ఈడీ తన పేరును సౌరభ్ పేరును ప్రస్తావించడం ఇందుకు బలాన్నిస్తుందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ నాయకులు ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా తనను సంప్రదించి ఆ పార్టీలో చేరాల్సిందిగా కోరారని లేకపోతే అరెస్టుకు సిద్ధంగా ఉండాల్సిందిగా హెచ్చరించారని పేర్కొనారు. కాగా, ఆతిశీ వ్యాఖ్యల్ని బీజేపీ నాయకులు ఖండించారు. తమ పార్టీలో ఆమెకు అసలు చోటులేదని స్పష్టం చేశారు.