Share News

నవంబరు 20న ‘మహా’ ఎన్నికలు!

ABN , Publish Date - Oct 16 , 2024 | 01:46 AM

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల భేరీ మోగింది. హరియాణా ఎన్నికల పర్వం ముగిసి, వారం కూడా గడవకముందే కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు.

నవంబరు 20న ‘మహా’ ఎన్నికలు!

288 స్థానాలకు ఒకే దశలో పోలింగ్‌

ఝార్ఖండ్‌కు 2 దశల్లో.. నవంబరు 13, 20 తేదీల్లో..

దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ, 2 లోక్‌సభ

నియోజకవర్గాలకూ ఉప ఎన్నికలు

23న లెక్కింపు.. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ

న్యూఢిల్లీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల భేరీ మోగింది. హరియాణా ఎన్నికల పర్వం ముగిసి, వారం కూడా గడవకముందే కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. ఝార్ఖండ్‌లో రెండు దశల్లో (నవంబరు 13, 20 తేదీల్లో) ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను నవంబరు 23న ప్రకటిస్తారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన వయనాడ్‌ (కేరళ)తో పాటు నాందేడ్‌ (మహారాష్ట్ర) లోక్‌సభ స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 13, 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నవంబరు 23న ఓట్ల లెక్కింపు జరగనుందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 26న, ఝార్ఖండ్‌ అసెంబ్లీ గడువు 2025 జనవరి 5న ముగుస్తున్నప్పటికీ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు 4 వరకు గడువు ఇచ్చారు. ఝార్ఖండ్‌లో నవంబరు 13న జరిగే స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ అక్టోబరు 25 కాగా ఉపసంహరణకు అక్టోబరు 30 చివరి తేదీ. నవంబరు 20న జరిగే స్థానాలకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబరు 29 కాగా.. ఉపసంహరణకు నవంబరు 1 చివరి తేదీ. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు, 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 15లోపు జరగాల్సిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇప్పుడే జరిపించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరినప్పటికీ ఈసీ పట్టించుకోలేదు. నిజానికి హరియాణా ఎన్నికలను కూడా మహారాష్ట్రతో పాటే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ జమ్మూకశ్మీర్‌తో కలిపి నిర్వహించింది. జమ్మూకశ్మీర్‌లో భద్రతా సమస్యల వల్ల మహారాష్ట్రను హరియాణా నుంచి వేరు చేశామని సీఈసీ తెలిపారు.

మహారాష్ట్రలో హోరాహోరీ

మహారాష్ట్రలో ఉద్దవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్‌ పవార్‌ ఎన్సీపీ, కాంగ్రె్‌సతో కూడిన మహా వికాస్‌ అఘాఢీకి; బీజేపీ, ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమికి మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లు, శివసేన 56 సీట్లు గెలుచుకోగా.. ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్నాయి. రాజకీయ పరిణామాలు మారి.. శివసేన కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి (మహాయుతి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం శివసేన నుంచి ఏక్‌నాథ్‌ శిందే, ఎన్సీపీ నుంచి అజిత్‌ పవార్‌లు తమ వర్గం ఎమ్మెల్యేలతో బయటికొచ్చి.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లలో కేవలం 9 సీట్లే గెలుచుకోగా, మహా వికాస్‌ అఘాఢీ 30 సీట్లు గెలుచుకుంది. తాజాగా శిందే సర్కారులోనూ విభేదాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో మహా వికాస్‌ అఘాఢీ, మహాయూతి కూటముల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇక 2019లో ఝార్ఖండ్‌లో జేఎంఎం 30 సీట్లు, కాంగ్రెస్‌ 16 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 25 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా జేఎఎం-కాంగ్రెస్‌ కూటమి; బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొననుంది. కాగా, మహారాష్ట్రలో ఎన్నికలకు అతి తక్కువ సమయం ఇచ్చారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. కేవలం 35 రోజులే సమయం ఇచ్చారని విమర్శించారు. అదేసమయంలో ప్రభుత్వం భారీగా పథకాలు ప్రకటించుకునేందుకు ఈసీ అవకాశం కల్పించిందని కాంగ్రెస్‌ నేత విజయ్‌ ఆరోపించారు. అలాగే 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకే దశలో ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే ఇలా చేశారని ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు పన్నినా తమ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Oct 16 , 2024 | 01:46 AM