Share News

Jaahnavi Kandula: జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం.. ఆ తీర్పుపై రివ్యూ కోరిన భారత్

ABN , Publish Date - Feb 24 , 2024 | 03:53 PM

సంచలనం సృష్టించిన జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మృతికి కారణమైన సియాటెల్ పోలీసు అధికారి కెవిన్ డవేపై (Kevin Dave) నేరారోపణల్ని ఎత్తివేస్తూ అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా భారత్ స్పందించింది. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని సియాటెల్ భారత రాయబార కార్యాలయం (Indian embassy) కోరింది.

Jaahnavi Kandula: జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం.. ఆ తీర్పుపై రివ్యూ కోరిన భారత్

సంచలనం సృష్టించిన జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మృతికి కారణమైన సియాటెల్ పోలీసు అధికారి కెవిన్ డవేపై (Kevin Dave) నేరారోపణల్ని ఎత్తివేస్తూ అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా భారత్ స్పందించింది. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని సియాటెల్ భారత రాయబార కార్యాలయం (Indian embassy) కోరింది. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని, తగిన పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.


‘‘జాహ్నవి కందుల మృతిపై ఇటీవల కింగ్ కౌంటీ ప్రాసిక్యూషన్ అటార్నీ (King County Prosecution Attorney) విడుదల చేసిన ‘దర్యాప్తు నివేదిక’పై.. మేము సంబంధిత అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నాం. జాహ్నవి, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా.. కాన్సులేట్ అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తూనే ఉంటుంది. తగిన పరిష్కారం కోసం సియాటెల్ పోలీసులతో పాటు స్థానిక అధికారుల వద్ద కూడా ఈ విషయాన్ని గట్టిగా లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు సమీక్ష కోసం ఈ కేసుని సియాటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి పంపబడింది. సియాటెల్ పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు మేము వేచి ఉన్నాం. ఈ కేసు పురోగతిని పర్యవేక్షిస్తూనే ఉంటాం’’ అని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చింది.

ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతి చెందింది. దాదాపు 120 కి.మీ. వేగంతో పోలీసు వాహనం ఢీకొనడంతో ఆమె 100 అడుగుల ఎత్తుకు ఎగిరి పడింది. బాడీక్యామ్ ఫుటేజీలో డేవ్ సహోద్యోగి డేనియల్ ఆడెరర్ (Daniel Auderer) ఆమె మృతిని చులకన చేసి మాట్లాడాడు. అతనిపై సస్పెన్షన్ వేటు పడింది కానీ, ఈ ప్రమాదం జరిగిన సమయంలో అతడు అక్కడ లేడని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ తెలపడం గమనార్హం. మరోవైపు.. సాక్ష్యాధారాలు లేకపోవడంతో డవేపై అభియోగాలు మోపడం లేదని పేర్కొంటూ.. కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ కార్యాలయం ఇటీవల ప్రకటించింది.

Updated Date - Feb 24 , 2024 | 03:53 PM