Share News

BSP : బీఎస్పీ కథ ముగిసినట్టేనా?

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:33 AM

దళితుల గొంతుకగా పేరొందిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ), ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కథ ముగిసిందా ?. బెహన్‌జీ(అక్కగారు), ఉక్కు మహిళ(ఐరన్‌ లేడీ)గా ఖ్యాతి పొందిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మ్యాజిక్‌కు కాలం చెల్లిందా ? అంటే, అవును అనే సమాధానమే వస్తోంది. ఎన్నికల్లో బీఎస్పీ

BSP : బీఎస్పీ కథ ముగిసినట్టేనా?

హైదరాబాద్‌, జూన్‌ 4 : దళితుల గొంతుకగా పేరొందిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ), ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కథ ముగిసిందా ?. బెహన్‌జీ(అక్కగారు), ఉక్కు మహిళ(ఐరన్‌ లేడీ)గా ఖ్యాతి పొందిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మ్యాజిక్‌కు కాలం చెల్లిందా ? అంటే, అవును అనే సమాధానమే వస్తోంది. ఎన్నికల్లో బీఎస్పీ సాధిస్తున్న ఫలితాలే ఇందుకు కారణం. 1984లో బీఎస్పీ పార్టీ ఏర్పాటవ్వగా.. 1995 జూన్‌ 3న ఉత్తరప్రదేశ్‌(యూపీ) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మాయావతి దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి దళిత మహిళగా చరిత్ర సృష్టించారు. అనంతరం, 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించి సంపూర్ణ మెజార్టీతో యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సరికొత్త చరిత్ర లిఖించారు. ఆ తర్వాతి నుంచి బీఎస్పీ పతనం క్రమంగా ప్రారంభమైంది. 2004లో దేశవ్యాప్తంగా 435 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ యూపీలోని 19 స్థానాల్లో గెలుపొందింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో 500 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ యూపీలో 20, మధ్యప్రదేశ్‌లో ఒకటి కలిపి 21 స్థానాల్లో గెలిచింది. 2014లో 513 స్థానాల్లో పోటీ చేసి ఖాతా తెరవలేకపోయిన బీఎస్పీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 383 చోట్ల పోటీ చేసి యూపీలోని 10 స్థానాల్లో గెలిచింది. ఆ పది కూడా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), ఆర్‌ఎల్డీ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్లే దక్కాయి. అనంతరం 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేఒక్క సీటు గెలిచిన ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఇక, ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీఎస్పీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. యూపీతోపాటు పోటీ చేసిన ఇతర రాష్ట్రాల్లో కూడా కనీస ప్రభావం చూపలేకపోయింది. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు బహుజన వాదాన్ని తిరిగి అందుకున్నా ఫలితం లేకపోయింది.

Updated Date - Jun 05 , 2024 | 05:33 AM