Share News

సామూహిక హత్యాచారమే?

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:45 AM

కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ వైద్యకళాశాల ఆస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్‌ వైద్యురాలి (31)పై అత్యాచారం, హత్య ఘటనకు దిగ్ర్భాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై సామూహిక

సామూహిక హత్యాచారమే?

కోల్‌కతా వైద్యురాలి శరీరంలో 150 మి.గ్రా వీర్యం.. పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడి

గ్యాంగ్‌ రేప్‌ చేసి చంపారన్న మృతురాలి తల్లిదండ్రులు

నిందితుడిని రక్షించేలా ఆస్పత్రి తీరు: రాహుల్‌ గాంధీ

కోల్‌కతా, ఆగస్టు 14: కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ వైద్యకళాశాల ఆస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్‌ వైద్యురాలి (31)పై అత్యాచారం, హత్య ఘటనకు దిగ్ర్భాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. హతురాలి శరీరంలో పెద్ద పరిమాణంలో 150 మిల్లీగ్రాముల వీర్యాన్ని గుర్తించినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడైంది. వైద్యురాలిపై హత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలంటూ హతురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించడం... ఆ మేరకు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. కాగా హైకోర్టులో వేసిన పిటిషన్‌లో హతురాలి తల్లిదండ్రులు.. పోస్టుమార్టం నివేదికలోని అంశాలను పేర్కొన్నారు. ‘‘హతురాలి శరీరంలో 150 మిల్లీ గ్రాముల పరిమాణంలో వీర్యం లభించినట్లు తేలింది. ఇది వ్యక్తి ద్వారా సాధ్యం కాదు. అత్యాచార ఘటనలో ఒకరిని మించి ఉన్నారని ఈ పరిమాణం సూచిస్తోంది. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చంపేశారు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ కూతురి శరీరంలో చెవులు, మెడ, పెదవులపై తీవ్ర గాయాలున్నాయని, అత్యాచారానికి పాల్పడే క్రమంలో ఆమెపై పాశవిక దాడికి పాల్పడ్డారని, ఇదంతా ఒక్కరితో అయ్యే పని కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా బలమైన ఆధారం లభించినా ఈ కేసులో మిగతా నిందితులను ఇప్పటిదాకా అరెస్టు చేయలేదని హతురాలి తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు.. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేసును సీబీఐ తమ చేతుల్లోకి తీసుకుంది. నిందితుడు సంజయ్‌ రాయ్‌ని కూడా కస్టడీలోకి తీసుకుంది. కాగా, ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి.. నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరిగాయని.. ఇవి ఆస్పత్రి నిర్వాహకులు, స్థానిక యంత్రాంగం తీరుపై తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. మహిళా వైద్యులకు మెడికల్‌ కాలేజీలోనే రక్షణ లేకుండా పోతే తల్లిదండ్రులు తమ బిడ్డలను చదువుల కోసం ఇళ్ల నుంచి బయటకు ఎలా పంపగలరని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ ఎవ్వరూ ఇలాంటి ఆలోచన చేయాలంటేనే భయపడేలా నిందితులకు కఠిన శిఽక్ష విధించాలని పేర్కొన్నారు. మరోవైపు, హత్యాచార ఘటనలో సీఎం మమత నిందితుడి పక్షం వహిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఆమె వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.

మహిళా వైద్యులు, విద్యార్థినులు ఒంటరిగా ఉండొద్దు

అసోం మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి సూచన

తీవ్ర విమర్శలు రావడంతో యూటర్న్‌

దిస్‌పూర్‌, ఆగస్టు 14: మహిళా డాకర్ల భద్రత పేరిట అసోంలోని సిల్చార్‌ ఆస్పత్రి మెడికల్‌ కాలేజీ జారీ చేసిన అడ్వయిజరీ తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినులు, మహిళా సిబ్బంది నిర్మానుష్య ప్రాంతాలకు, వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాలకు, జనసంచారం లేని ప్రాంతాలకు దూరంగా ఉండాలని అడ్వయిజరీలో పేర్కొంది. దీంతోపాటు ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలని, అత్యంత అవసరమైతే తప్ప రాత్రిపూట హాస్టళ్ల నుంచి బయటికి వెళ్లొద్దని సూచించింది. ఒకవేళ తప్పనిసరై వెళ్లాల్సి వస్తే అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలని కోరింది. విధుల్లో ఉన్నప్పుడు ఇతరులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, తద్వారా అనైతికంగా వ్యవహరించే వ్యక్తుల దృష్టిలో పడకుండా ఉండొచ్చని తెలిపింది. ఈ అడ్వయిజరీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అడ్వయిజరీలో వాడిన పదజాలం తమను బాధించిందని సిల్చార్‌ మెడికల్‌ కాలేజీ జూనియర్‌ డాక్టర్ల సంఘం తెలిపింది. తమను హాస్టల్‌ గదులకు పరిమితం కావాలని చెప్పే బదులు.. భద్రతా ఏర్పాట్లు మెరుగుపరచాలని కోరింది. దీంతో సిల్చార్‌ ఆస్పత్రి మెడికల్‌ కాలేజీ వెంటనే తమ అడ్వయిజరీని వెనక్కి తీసుకుంది.

Updated Date - Aug 15 , 2024 | 05:13 AM