Share News

CM of Odisha : ఒడిసా సీఎంగా మోహన్‌ చరణ్‌ మాఝీ

ABN , Publish Date - Jun 12 , 2024 | 04:31 AM

తొలిసారి ఒడిసాలో అధికారం దక్కించుకున్న బీజేపీ.. గిరిజన నేతకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. కియోంజర్‌ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌ చరణ్‌ మాఝీ

 CM of Odisha : ఒడిసా సీఎంగా మోహన్‌ చరణ్‌ మాఝీ

గిరిజన నేతకు అవకాశం కల్పించిన బీజేపీ

భువనేశ్వర్‌లో నేడు ప్రమాణ స్వీకారం

భువనేశ్వర్‌, జూన్‌ 11: తొలిసారి ఒడిసాలో అధికారం దక్కించుకున్న బీజేపీ.. గిరిజన నేతకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. కియోంజర్‌ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌ చరణ్‌ మాఝీ (52)ని సీఎంగా ఎంపిక చేసింది. ప్రవతీ పరిడా, కేవీ సింగ్‌దేవ్‌లకు ఉప ముఖ్యమంత్రులు పదవులు దక్కనున్నాయి. మంగళవారం భువనేశ్వర్‌లో ఒడిసా బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, భూపేంద్ర యాదవ్‌ పరిశీలకులుగా హాజరయ్యారు. అనంతరం మాఝీని శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాజ్‌నాథ్‌ ప్రకటించారు. బుధవారం సాయంత్రం మాఝీ, పలువురు మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వాన తొలి పత్రికను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలోని జగన్నాథస్వామికి సమర్పించి పూజలు చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేడీ అధినేత, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ను ఆహ్వానించారు. కాగా, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు సైతం దీనికి హాజరవనున్నారు. 147 సీట్లున్న ఒడిసాలో ఎన్నికల్లో బీజేపీ 78 గెలుచుకుని తొలిసారిగా అధికారం చేపట్టనుంది.

వాచ్‌మన్‌ కుమారుడు.. సర్పంచి.. జార్ఖండ్‌ ఎన్నికలు

మోహన్‌ చరణ్‌ 1997-2000 మధ్యన ఆదివాసీ ప్రాంతం రాయికల సర్పంచ్‌గా పనిచేశారు. ఈయన తండ్రి వాచ్‌మన్‌. కాగా, 2000 సంవత్సరంలో మాఝీ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2019లోనూ నెగ్గారు. ప్రజా సంబంధాలు, సంస్థాగతంగా బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. మరోవైపు జార్ఖండ్‌లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒడిసా పొరుగున ఉండే ఈ రాష్ట్రంలో గిరిజనులు 26 శాతం పైగా ఉంటారు. వారిని మచ్చిక చేసుకునే ఉద్దేశంలోనే మాఝీని ఒడిసా సీఎం చేసినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

గత ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌లో సీనియర్‌ నాయకులు, సీఎంలుగా పనిచేసిన శివరాజ్‌ చౌహాన్‌, రమణ్‌సింగ్‌, వసుంధరా రాజెలను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చింది బీజేపీ. ఒడిసాలోనూ ఇదే తరహాలో ఆశ్చర్యకర ఎంపిక చేపట్టింది. కాగా, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌లను అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం ఎంపికకు పరిశీలకులుగా బీజేపీ నియమించింది. వీరు బుధవారం ఇటానగర్‌ వెళ్లనున్నారు. ప్రస్తుత సీఎం పెమా ఖండూనే మళ్లీ ఎన్నుకునే వీలుంది.

Updated Date - Jun 12 , 2024 | 04:31 AM