హరియాణా సీఎంగా నాయబ్ సైనీ
ABN , Publish Date - Mar 13 , 2024 | 04:18 AM
ఉత్తరాది రాష్ట్రం హరియాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఒక్క రోజులోనే రాజకీయం మారిపోయింది.
మనోహర్లాల్ ఖట్టర్ అనూహ్య రాజీనామా
ఆయన స్థానంలో సీఎంగా ఓబీసీ నేత సైనీ
ప్రమాణం చేయించిన గవర్నర్ దత్తాత్రేయ
ప్రస్తుతం కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ..!
జననాయక్ జనతా పార్టీతో బీజేపీ కటీఫ్
లోక్సభ ఎన్నికల్లో పొత్తుపై విభేదాలతోనే..
ఛండీగఢ్, మార్చి 12: ఉత్తరాది రాష్ట్రం హరియాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఒక్క రోజులోనే రాజకీయం మారిపోయింది. మనోహర్లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ నాయబ్ సింగ్ సైనీ(54) సీఎంగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సైనీ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 90 అసెంబ్లీ స్థానాలున్న హరియాణలో 2019 అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలిచింది. సాధారణ మెజారిటీ(46)కి కొద్ది దూరంలో ఆగిపోయింది. దీంతో 10 సీట్లు నెగ్గిన దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దుష్యంత్కు డిప్యూటీ సీఎంగా, ఆయన పార్టీకి చెందిన ఇద్దరికి మంత్రులుగా అవకాశం ఇచ్చింది. అయితే, లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో భారీ మార్పులు ఉంటాయంటూ మంగళవారం ఉదయం ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఖట్టర్ సహా 13 మంది మంత్రులు రాజీనామాలు చేసేశారు. వీటిని గవర్నర్ దత్తాత్రేయ ఆమోదించారు. కొద్దిసేపటికి బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై సైనీని తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్రంలోని ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీ సర్కారుకు మద్దతు ప్రకటించారు. దీంతో జేజేపీ మద్దతు లేకుండానే మెజారిటీ చేకూరింది. మంగళవారం సాయంత్రమే సైనీతో గవర్నర్ దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. ప్రతిపక్ష కాంగ్రె్సకు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హరియాణ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఖట్టర్ 2014 నుంచి సీఎంగా కొనసాగారు. ఖట్టర్ను కర్నాల్ నుంచి ఎంపీగా బరిలో నిలిపే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఖట్టర్కు సన్నిహితుడు
నాయబ్సింగ్ సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లా మిర్జాపుర్ మజ్రా గ్రామంలో జన్మించారు. 30 ఏళ్ల కింద బీజేపీలో చేరారు. ఆర్ఎ్సఎ్సలో పనిచేసినప్పటి నుంచే ఖట్టర్కు సన్నిహితుడయ్యారు. నారాయణగడ్ నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఖట్టర్ మంత్రివర్గంలోనూ పనిచేశారు. గత అక్టోబరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ నియమితులయ్యారు. హరియాణ జనాభాలో నాయబ్సింగ్ సామాజికవర్గమైన సైనీలు 8ు ఉంటారు. రాష్ట్రంలో బలమైన జాట్లు కాంగ్రెస్, జేజేపీ, ఐఎన్ఎల్డీకి మద్దతుగా నిలుస్తుండడంతో.. ఓబీసీలు, ఇతర వర్గాలను ఆకర్షించేందుకు సైనీని బీజేపీ రాష్ట్ర చీఫ్గా నియమించింది. ఇప్పుడు ఏకంగా సీఎం బాధ్యతలు అప్పగించింది. ్జ్జకాగా, రాష్ట్రంలో పరిణామాల నేపథ్యంలో జేజేపీ నాయకత్వం తమ పదిమంది ఎమ్మెల్యేలను ఢిల్లీలో మంగళవారం భేటీకి పిలిచింది. ఐదుగురు ఎమ్మెల్యేలు దీనికి డుమ్మాకొట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ చీలిపోతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీరంతా బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉంది.