Rahul Gandhi : గుండె, ప్రాణం,రక్తం పణం పెట్టయినా రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం
ABN , Publish Date - May 29 , 2024 | 06:13 AM
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని, రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. ‘‘దిల్(గుండె), జాన్(ప్రాణం), కూన్(నెత్తురు) పణం పెట్టయినా రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం’’ అని రాహుల్
రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం: రాహుల్ గాంధీ
ఈసారి ప్రధానిగా మోదీ ఉండరని వారాణసీలో వ్యాఖ్య
వారాణసీ, మే 28: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని, రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. ‘‘దిల్(గుండె), జాన్(ప్రాణం), కూన్(నెత్తురు) పణం పెట్టయినా రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 తర్వాత ప్రధానిగా మోదీ ఉండబోరని జోస్యం పలికారు. చివరి విడత పోలింగ్ జరిగే మోదీ నియోజకవర్గం వారాణసీ, బాన్స్గావ్ సహా యూపీలోని పలు నియోజకవర్గాల్లో మంగళవారం జరిగిన ప్రచారసభల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘‘రెండు భావాల మధ్య యుద్ధంగా సార్వత్రిక ఎన్నికలు సాగుతున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ కోసం ‘ఇండియా కూటమి’, రాజ్యాంగ వినాశనం కోసం ఎన్డీయే కూటమి పరస్పరం తలపడుతున్నాయి’’ అని రాహుల్ అన్నారు. రాజ్యాంగ గ్రంథం, అంబేడ్కర్, గాంధీల ఫొటోలను ఆయన సభలో ప్రదర్శిస్తూ మాట్లాడారు. ‘దళితులకు రాజ్యాంగంలో అంబేడ్కర్ ఆత్మగౌరవాన్ని అందించారు. అందువల్లే ఆయన రచించిన రాజ్యాంగ భాగాలను తొలగించాలని బీజేపీ చూస్తోంది. కానీ, బీజేపీని ఈ ప్రయత్నంలో సఫలం కానీయబోం. అంబేడ్కర్, నెహ్రూ ఆలోచనలతో నిండిన రాజ్యాంగాన్ని నాశనం చేసే సాహసం ఏ శక్తీ చేయలేదు’’ అని రాహుల్ హెచ్చరించారు.