Share News

NEET Exam : నీట్‌.. కమర్షియల్‌

ABN , Publish Date - Jul 02 , 2024 | 05:31 AM

మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్ష మొత్తం కమర్షియల్‌గా మారిపోయిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ధనవంతుల పిల్లల కోసమే దాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. ఎగ్జామ్‌ పేరు(కోచింగ్‌ నుంచి అక్రమాల వరకు)తో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. నీట్‌ ఎంతమాత్రం ప్రొఫెషనల్‌ పరీక్ష

NEET Exam : నీట్‌.. కమర్షియల్‌

ధనవంతుల పిల్లల కోసమే ఈ పరీక్షను రూపొందించారు

జాతీయ స్థాయి పేరుతో అడ్మిషన్లు కేంద్రీకృతం చేశారు

లీక్‌పై చర్చకు ఒకరోజును కేటాయించాలి: రాహుల్‌గాంధీ

రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండగా వేరే అంశానికి సమయం కుదరదన్న రాజ్‌నాథ్‌, స్పీకర్‌

నిరసనగా లోక్‌సభ నుంచి ‘ఇండియా’ ఎంపీల వాకౌట్‌

న్యూఢిల్లీ, జూలై 1: మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్ష మొత్తం కమర్షియల్‌గా మారిపోయిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ధనవంతుల పిల్లల కోసమే దాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. ఎగ్జామ్‌ పేరు(కోచింగ్‌ నుంచి అక్రమాల వరకు)తో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. నీట్‌ ఎంతమాత్రం ప్రొఫెషనల్‌ పరీక్ష కాదన్నారు. జాతీయ స్థాయి పరీక్ష పేరుతో మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలను కేంద్రీకృతం చేశారని విమర్శించారు. ఓ విద్యార్థి నీట్‌లో మంచి ర్యాంకు సాధించినా డబ్బు లేకపోతే కాలేజీలో చేరలేని పరిస్థితి ఉందన్నారు. సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే, రాహుల్‌ నీట్‌ పేపర్‌ అంశాన్ని లేవనెత్తారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకైన వ్యవహారంపై చర్చకు ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ‘‘నీట్‌ పేపర్‌ లీక్‌ ప్రభావం లక్షలాది మంది విద్యార్థులపై పడింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. పార్లమెంట్‌లో దీనిపై చర్చించడం ద్వారా విద్యార్థులకు సానుకూల సంకేతాలిద్దాం. అందువల్ల చర్చకు అనుమతించండి’’ అని కోరారు. దీనిపై రక్షణ మంత్రి, లోక్‌సభ డిప్యూటీ లీడర్‌ రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసేవరకు వేరే అంశంపై చర్చ కుదరని చెప్పారు. అలాగైతే ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాతనైనా సమయం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ.. ధన్యవాద తీర్మానం సందర్భంగా వేరే అంశంపై చర్చ సంప్రదాయం లోక్‌సభలో లేదన్నారు. ఇదే సమయంలో, ధన్యవాద తీర్మానంపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ చర్చను ప్రారంభించడంతో విపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. ఇదిలా ఉండగా, విపక్ష నేతల గొంతు నొక్కడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం మానుకోవాలని ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీఎంసీ, ఆప్‌ ఎంపీలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. అవినీతి ఆరోపణలతో బెంగాల్‌లో అరెస్టు చేసిన ముగ్గురు మంత్రులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. కేజ్రీవాల్‌ పోస్టర్లను ప్రదర్శించారు.

Updated Date - Jul 02 , 2024 | 05:31 AM